ఉత్తరప్రదేశ్లో మరో రెండు రేప్లు : ఒకటి - ఇంట్లో.. రెండోది చెరకు తోటలో...
దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్లో శుక్రవారం మరో రెండు అత్యాచారాలు జరిగాయి. ఇక్కడ ఎన్నో రకాలుగా చర్యలు తీసుకుంటున్నా మృగరాయుళ్లు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఫలితంగా ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో మహిళలు మానభంగాలకు గురికావడం నిత్యకృత్యంగా మారింది.
తాజాగా ముజఫర్ నగర్ జిల్లాలో కెతోరా గ్రామంలో ఓ యువతి సరుకులు కొనేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. కాపుకాసిన సలీం ఖురేషీ, జహీరత్ అనే ఇద్దరు యువకులు ఆమెను సమీపంలోని ఓ ఇంట్లోకి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
దీంతో ఆమె ఇల్లు చేరుకుని జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు వివరించడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్లగా, వారు పరారీలో ఉన్నట్టు తెలుసుకుని గాలింపు మొదలుపెట్టారు.
అలాగే, మరో ఘటనలో మజ్లిస్పూర్ తోఫిర్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక పొలంలోకి వెళ్లగా నీతు అనే యువకుడు ఆ బాలికను చెరకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికి చేరిన బాలిక తల్లిదండ్రులకు విషయం వివరించడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నీతు కోసం గాలింపు చేపట్టారు.