మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2016 (09:25 IST)

ఖాతాలో డబ్బులున్నాయి.. కానీ పైసా ఇవ్వలేదు... అంత్యక్రియలు వాయిదా!

బ్యాంకు ఖాతాలో డబ్బులున్నా.. భార్య అంత్యక్రియలకు చేతిలో డబ్బులు లేకపోవడంతో.. ఓ వ్యక్తి వాటిని ఒక రోజు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో మురికివాడల

బ్యాంకు ఖాతాలో డబ్బులున్నా.. భార్య అంత్యక్రియలకు చేతిలో డబ్బులు లేకపోవడంతో.. ఓ వ్యక్తి వాటిని ఒక రోజు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో మురికివాడల సమీపంలో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించే మున్నీలాల్ (65) భార్య ఫూల్‌మతి (62) కేన్సర్‌తో బాదపడుతూ సోమవారం మధ్యాహ్నం మరణించింది. 
 
మున్నీలాల్‌కు, అతడి కొడుక్కు కలిపి బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో 16 వేల రూపాయలకు పైగా ఉన్నాయి. వాటిని తీసుకుని అంత్యక్రియలు చేద్దామని ఎంత ప్రయత్నించినా ఆరోజు సాధ్యం కాలేదు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల పాటు తాను బ్యాంకు వద్దే క్యూలో నిల్చున్నానని, కానీ తాను వెళ్లేసరికి డబ్బులు అయిపోయాయని చెప్పారని మున్నీలాల్ తెలిపారు. 
 
తన భార్య అంత్యక్రియల కోసం కావాలని ప్రాధేయపడినా.. బ్యాంకు ఉద్యోగులు మాత్రం తన మాటలు నమ్మలేదన్నారు. చుట్టుపక్కల వాళ్లను అడిగినా వాళ్ల దగ్గర కూడా డబ్బులు లేవు. దాంతో, భార్య శవాన్ని ఇంటిదగ్గరే ఒక ఫుట్‌పాత్ మీద ఉంచి మళ్లీ మంగళవారం బ్యాంకుకు వెళ్లాడు. అప్పుడు కూడా పెద్ద క్యూ ఉంది. బ్యాంకు అధికారులను మళ్లీ అడిగినా ప్రయోజనం కనిపించలేదు.
 
దాంతో మున్నీలాల్ ఇంటి పక్కన ఉండే వ్యక్తి ఈ విషయాన్ని స్థానిక నాయకులకు, మీడియాకు చెప్పారు. మధ్యాహ్నం 12.30 ప్రాంతంలో మీడియా వాళ్లు, స్థానిక నాయకులు బ్యాంకుకు వెళ్లి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించగా.. మున్నీలాల్‌ను మేనేజర్ తన క్యాబిన్‌లోకి పిలిచి, అతడి ఖాతా నుంచి రూ.15 వేలు తీసి ఇచ్చారు. దీనిపై సదరు బ్రాంచి మేనేజర్‌ శిశుపాల్‌ను ప్రశ్నించగా, సోమవారం అతడు వచ్చేసరికే బ్యాంకులో మొత్తం డబ్బంతా అయిపోయిందని, మంగళవారం మళ్లీ రావడంతో అతడికి ఇచ్చామని అన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించాల్సిందిగా గౌతమబుద్ధ నగర్ జిల్లా కలెక్టర్ ఎన్‌పీసింగ్ ఆదేశించారు.