శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 29 జనవరి 2017 (06:10 IST)

ఒక్క ఛాన్సివ్వండి.. అన్నీ ఫ్రీగా ఇస్తాం: ఆ గడ్డపై వాగ్దానాల గబ్బు..!

మాస్ వాగ్దానాలు గుప్పించడంలో తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు మించినవి లేవని ఇన్నాళ్లూ అనుకునే వాళ్లం. కాని ఇప్పుడు ఉత్తరాఖండ్ వీటిని తలదన్నే హామీలను గుప్పిస్తోంది. స్మార్ట్ ఫోన్ ఉన్నప్పటికీ మరో ఫోన్ ప్రీగా ఇస్తామని, ఫోన్‌తోపాటు డేటా, కాల్స్, అన్న

మాస్ వాగ్దానాలు గుప్పించడంలో తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు మించినవి లేవని ఇన్నాళ్లూ అనుకునే వాళ్లం. కాని ఇప్పుడు ఉత్తరాఖండ్ వీటిని తలదన్నే హామీలను గుప్పిస్తోంది. స్మార్ట్ ఫోన్ ఉన్నప్పటికీ మరో ఫోన్ ప్రీగా ఇస్తామని, ఫోన్‌తోపాటు డేటా, కాల్స్, అన్నీ ఫ్రీగా ఇస్తామని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీల వర్షం కురిపించింది. ఈ హామీలతో పోలిస్తే రిలయన్స్ జియో బంపర్ ఆఫర్లు ఒక మూలకు కూడా రావంటున్నారు. 
 
ఉత్తరాఖండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి హరీశ్ రావత్ శనివారం తమ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. యువత, మహిళలు, నిరుద్యోగులు, మాజీ సైనికులను ఆకట్టుకునేందుకు అక్కడి అధికార పార్టీ పలు వరాలను ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రతి యువకుడికి ఉచితంగా స్మార్ట్‌ ఫోన్‌ అందిస్తామని రావత్ ప్రకటించారు. ఆ ఫోన్లకు ఉచిత కాలింగ్‌, ఇంటర్‌నెట్‌ సౌకర్యం కూడా అందిస్తామని తెలిపారు.
 
స్మార్ట్ ఫోన్‌ నుంచి కాల్స్‌ ఫ్రీ.. ఆ మొబైల్‌కు ఇంటర్నెట్‌ ఫ్రీ. నిరుద్యోగ యువతకు రెండున్నర వేల భృతి. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌. ఫిబ్రవరి 15న ఎన్నికలు జరగనున్న ఉత్తారఖండ్‌లో కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఇది. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఉండేలా చూస్తామని, నిరుద్యోగులకు రూ.2500 భృతి ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న మాజీ సైనికుల కోసం ప్రత్యేకంగా శాఖను ఏర్పాటు చేస్తామని దాని ద్వారా వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని రావత్ తెలిపారు. ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పన, తాగునీటి కుళాయిల ఏర్పాటు తదితర హామీలన్నీ కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో అదనం.  
 
ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఆయా పార్టీలు యువతపై ఇలా వరాలు కురిపించడం వల్ల ఎన్నికల్లో నెగ్గి సీఎం పీఠంపై కూర్చున్నారు. అందుకనే ఉత్తరాఖండ్ కూడా ఇలా ప్రయత్నాలు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం అధికార పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నాయి. అంత డబ్బులు ఎక్కడ నుంచి తెస్తారు.. మీరు ఖర్చు పెట్టబోయే డబ్బులు ఎక్కడ్నుంచి వచ్చిందో చెప్పాలంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. 
 
విమర్శలు గుప్పించడం కంటే హామీలు ఇచ్చే అవకాశాన్ని తాము పోగొట్టుకున్నామే అనే బాధే ప్రతిపక్షాల విమర్శల్లో కనిపిస్తోందని పరిశీలకుల వ్యాఖ్య.