శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2014 (17:28 IST)

తల్లిదండ్రుల కోసం తనను అమ్మకానికి పెట్టుకున్న వడోదర మహిళ!

వడోదరకు చెందిన ఓ మహిళ తనను తాను అమ్మకానికి పెట్టుకుంది. దీనికి కారణం కటిక దరిద్ర్యం. ఈ దరిద్ర్యం కొందరిలో పట్టుదల పెంచి ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తే.. మరికొందరిని దుశ్చర్యలవైపు తీసుకెళుతోంది. 
 
20 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి వడోదరకు చాందిని రాజ్‌గౌర్ అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి వడోదరకు చేరుకుంది. ఈమె తన ఫేస్ బుక్ ఖాతాలో తన ఫొటో అప్‌లోడ్ చేసి, దానికింద ఓ సందేశం ఉంచింది. తల్లిదండ్రులకు వైద్య చికిత్స చేయించేందుకు అవసరమైన డబ్బు కోసం తనను తాను అమ్ముకుంటున్నానని ఆ సందేశంలో పేర్కొంది. 
 
తల్లిదండ్రులు మంచాన పడడంతో వారి ఆలనాపాలన అంతా చాందినీయే కొన్నేళ్లుగా చూసుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న ఓ జాతీయ మీడియా ఆమెను సంప్రదించగా, తనను తాను అమ్ముకోవడం తప్ప తనకు మరోమార్గం కనిపించలేదని, అందుకే అమ్మకానికి పెట్టుకున్నట్టు తెలిపింది. 
 
అంతేకాకుండా, వైద్య ఖర్చుల కోసం "నా తల్లిదండ్రుల కోసం నన్ను కొనండి" అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. తమ ఇక్కట్లు తీరాలంటే తాను అమ్ముడవడం తప్ప మరోమార్గం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.