గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 2 జులై 2015 (14:40 IST)

సీఎం పదవికి వసుంధరా రాజే రాజీనామా చేయరు : షా నవాజ్ హుస్సేన్

వివాదాస్పద వ్యాపారి, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీతో సంబంధాలు కలిగివున్న కారణంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవికి వసుంధరా రాజే రాజీనామా చేయరని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ స్పష్టం చేశారు. తద్వారా వసుంధరా రాజేకు బీజేపీ హైకమాండ్ పూర్తి అండగా నిలబడినట్టయింది.
 
ఇదే అంశంపై ఆయన పాట్నాలో విలేకరులతో మాట్లాడుతూ వసుంధరా రాజే రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ప్రజలకు సేవచేయడం కొనసాగిస్తారని తెలిపారు. రాజస్థాన్‌ నుంచి కాంగ్రెస్‌ను పూర్తిగా తరిమికొట్టినందుకు ఆమె కంకణం కట్టుకున్నారన్నారు. అందువల్లే ఆమెపై కాంగ్రెస్ పార్టీ బురదచల్లడమే పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. 
 
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రాజభవనాన్ని రాజే కుమారుడు దుష్యంత్ సింగ్ సొంతం చేసుకున్నారన్న ఆరోపణల గురించి అడగ్గా, ఈ ఆస్తికి సంబంధించిన వివాదం కోర్టులో పరిష్కారమైందని, కోట్ల రూపాయల విలువైన ఆ ప్యాలెస్ దుష్యంత్‌దేనని కోర్టు సైతం తీర్పు ఇచ్చిందని షానవాజ్ చెప్పారు. కోర్టు దుష్యంత్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ఈ వ్యవహారంపై రాజకీయాలు ఎందుకు చేస్తోంది? అని ఆయన ప్రశ్నించారు.