మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 13 డిశెంబరు 2018 (12:16 IST)

తండ్రిపై నాలుగేళ్ళ చిన్నారి ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

కన్నతండ్రిపై నాలుగేళ్ళ చిన్నారి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఎందుకు చేసిందో తెలిస్తే ప్రతి ఒక్కరూ షాకవ్వాల్సిందే. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వచ్ఛ భారత్‌ను ప్రవేశపెట్టారు. ఇంటితో పాటు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నది ఈ పథకం ముఖ్యోద్దేశ్యం. 
 
ముఖ్యంగా, బహిరంగ మలమూత్ర విసర్జన వద్దంటూ కేంద్రం ప్రభుత్వం అనేక రకాలుగా ప్రచారం చేస్తోంది. అలాగే, అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరి అందరం పాటిస్తున్నామా? స్వచ్ఛమైన భారతదేశం కోసం మనవంతుగా మనం ఏం చేస్తున్నాం? అని ప్రశ్నంచుకుంటే మనకు మనం సమాధానం చెప్పుకునేందుకు కూడా ఆలోచించవలసిన పరిస్థితి కదా?
 
కానీ, తమిళనాడు రాష్ట్రంలోని నాలుగేళ్ళ చిన్నారి తన ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించాలని ప్రాదేయపడింది. కానీ ఆ తండ్రి చిన్నారి మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. అయినా ఆ చిన్నారి మాత్రం ఏమాత్రం ఊరుకోలేదు. ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తండ్రిని అరెస్టు చేయాలని అందులో పేర్కొంది. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. 
 
ఎన్నిసార్లు చెప్పినా, ప్రాధేయపడినా ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించడం లేదని, అందుకే అరెస్టు చేయాలంటూ తన ఫిర్యాదులో నాలుగేళ్ళ చిన్నారి పేర్కొంది. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అవాక్కయ్యారు. 
 
ఇంతకీ తండ్రిపై ఫిర్యాదు చేసిన చిన్నారి పేరు హనీషా. తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లా కేంద్రంలోని వినాయక వీధిలో ఉంటుంది. ఈమె తండ్రి పేరు ఇసానుల్లా. అన్నట్లు హనీషా ఎల్కేజీ చదువుతోంది. తండ్రితో చాలాసార్లు చెప్పి విసిగిపోయిన హనీషా... చివరికి బంధువుల సాయంతో ఆంబూరులోని మహిళా పోలీస్ స్టేషన్‌లో తండ్రిపై ఫిర్యాదు చేసింది.
 
చిన్నారి హనీషా మాటలు విని విస్తుపోయిన పోలీస్ అధికారులు.. తర్వాత ఈ  విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలా అలా ఈ విషయం చివరికు వేలూరు జిల్లా కలెక్టర్ రామన్‌ చెవికి చేరింది. దీంతో ఆయన దీనిపై తక్షణ విచారణకు ఆదేశించారు. 
 
రంగంలోకి దిగిన ఆంబూరు మున్సిపాలిటీ అధికారులు స్వచ్ఛ భారత్ పథకం కింద మరుగుదొడ్డి పనులను ప్రారంభించటమేకాకుండా.. మరుగుదొడ్డి నిర్మాణానికి చొరవ చూపిన చిన్నారిని అటు పోలీస్ ఉన్నతాధికారులు, జిల్లా, మున్సిపల్ అధికారులు అభినందించారు.