మహిళా రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : కేంద్ర మంత్రి వెంకయ్య
దేశ వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని, ఈ దిశగా ఏ6కాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగాలని ఆయన ఆకాంక్షించారు. కీలక బిల్లులు ఆమోదం పొందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
మహిళా రిజర్వేషన్లపై ఆయన స్పందిస్తూ.. మహిళా రిజర్వేషన్కు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, అయితే పార్లమెంట్, శాసనసభల్లో మాత్రం ఏకాభిప్రాయం కుదరడం లేదన్నారు. ముందు అందరూ సరే అంటున్నారని, తర్వాత అడ్డుపడుతున్నారని, ఈ విషయమై అందరితో చర్చలు జరుపుతున్నామన్నారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఇప్పటికే అమలవుతోందన్నారు. దేశం మొత్తం రిజర్వేషన్ అమలు కావాలని ఆకాంక్షిస్తున్నామని, ఇందుకోసం ఏకాభిప్రాయం రావాలని ఆశిస్తున్నట్లు కోరారు. వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో జీఎస్టీ సహా అన్ని బిల్లులు ఆమోదం పొందుతాయని వెంకయ్యనాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు.