మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (16:59 IST)

చిన్నమ్మకు జైలుశిక్ష సరేనన్న దీప.. 4వారాలు టైమివ్వండి లొంగిపోతా.. బాగోలేదని శశి డ్రామా

అక్రమాస్తుల కేసులో చిన్నమ్మపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై జయ మేనకోడలు దీప జయకుమార్ స్పందించారు. ఏఐడీఎంకేను నడిపించేందుకు ఎవరు ముందుకొచ్చినా వారు కీలుబొమ్మగానే మిగిలిపోక తప్పదని జోస్యం చెప్పారు. శశి

అక్రమాస్తుల కేసులో చిన్నమ్మపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై జయ మేనకోడలు దీప జయకుమార్ స్పందించారు. ఏఐడీఎంకేను నడిపించేందుకు ఎవరు ముందుకొచ్చినా వారు కీలుబొమ్మగానే మిగిలిపోక తప్పదని జోస్యం చెప్పారు. శశికళ కానీ, ఆమె కుటుంబ సభ్యులకు కానీ తమిళ ప్రజలను నడిపించే నైతిక హక్కు లేదన్నారు. శశికళ శిక్ష పడటం స్వాగతించాల్సిన విషయం అని దీప హర్షం వ్యక్తం చేశారు.
 
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి వెనుక దాగిన రహస్యాలను త్వరలో వెల్లడిస్తానని ఆమె సోదరుడి కుమార్తె దీప చెప్పారు. సోమవారం టి.నగర్‌లోని తన నివాసగృహం వద్ద కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ... కొత్త పార్టీ ప్రారంభించాలంటూ కార్యకర్తలంతా ఒత్తిడి చేస్తున్నారని, జయకు విశ్వాసంగా నడుచుకున్న కార్యకర్తలను కాపాడే బాధ్యత తనదేనని, తనను నమ్మి వచ్చిన ఎవరినీ నిర్లక్ష్యం చేయనని పేర్కొన్నారు. తన అత్త మృతి అనుమానాస్పదంగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందిన 75 రోజులు ఏమి జరిగిందో, ఎలాంటి చికిత్సలు అందించారో ఎవరికీ తెలియదన్నారు.
 
ఇదిలా ఉంటే.. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలుశిక్ష అనుభవించాలని, రూ.10 కోట్ల చొప్పున జరిమానా కట్టాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో షాక్ తిన్న శశికళ కొత్త సీన్‌కు తెరలేపారు. తనకు ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేదని, లొంగిపోయేందుకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, శశికళ కొత్త డ్రామాకు తెరలేపారని ఆమె వ్యతిరేకవర్గాల నుంచి గగ్గోలు మొదలైంది. 
 
ఆమెకు ఈ మేరకు సమయమిస్తే తమిళనాడులో అల్లకల్లోలం సృష్టిస్తారని, ఈ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ఎంతమాత్రం మన్నించరాదని విజ్ఞప్తి చేస్తున్నారు.  జైలుశిక్షలు పడిన చాలామంది నేతలు ఆ శిక్షల నుంచి తప్పించుకోవడానికి అనారోగ్యం పేరిట నాటకాలకు తెరలేపడం చూస్తూనే ఉన్నామని, అందువల్ల సుప్రీంకోర్టు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.