వరంగల్ లోక్ సభ స్థానం: వివేక్ మళ్లీ టీఆర్ఎస్లోకి..!
వరంగల్ లోక్ సభ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలనే అంశంపై టీఆర్ఎస్లో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. వరంగల్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కడియం శ్రీహరిని తన ఎంపి పదవికి రాజీనామా చేయించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు.. రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల ముందు టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి పెద్దపల్లి స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎంపి వివేక్ను మళ్లీ పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
టిఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుని వరంగల్ లోకసభ స్థానం నుంచి పోటీ చేయించాలని టిఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వివేక్ను తమ పార్టీలో చేర్చుకునేందుకు టిఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
అంతా టిఆర్ఎస్ అనుకున్నట్లు జరిగితే వరంగల్ పార్లమెంటు స్థానానికి జరిగే ఉప ఎన్నికల బరిలో టిఆర్ఎస్ అభ్యర్థిగా వివేక్ పోటీ చేసే అవకాశం ఉంది.