శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 23 జులై 2015 (14:07 IST)

వ్యాపం కేసు : భయంగా ఉంది మమ్మల్ని కాపాడండి!: ప్రణబ్‌కు మెడికోలు లేఖ

మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వ్యాపమ్ స్కామ్‌లో నిందితులుగా ఉన్న ఐదుగురు మెడికల్ విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ స్కామ్‌లో తమ ప్రాణాలకు ముప్పు ఉందని మెడికో స్టూడెంట్స్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆశ్రయించారు. వీరంతా మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షలో అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో గ్వాలియర్‌కు చెందిన మనీష్ శర్మ, రాఘవేంద్ర సింగ్, పంకజ్ బన్సాల్, అమిత్ చద్దా, వికాస్ గుప్తలు రాష్ట్రపతికి లేఖను రాస్తూ, తమ ప్రాణాలను కాపాడాలని లేకుంటే ఆత్మహత్యకు అనుమతించాలని కోరారు. ఈ కుంభకోణంలో తమ ప్రమేయం లేదని సిట్ తేల్చినప్పటికీ, కాలేజీ అధికారులు తమను వేధిస్తూనే ఉన్నారని లేఖలో ఆరోపించారు. 
 
రోజురోజుకీ తాము నరకంలో ఉన్నట్లు భావిస్తున్నామని, కేసులో నిందితులు విచారణ జరుపుతున్న అధికారులు సైతం ప్రాణాలు కోల్పోవడం చూసి భయంగా ఉందని వారు లేఖలో తెలిపారు. కాగా, వీరు చదువుతున్న కాలేజీలోనే రమణేంద్ర సింగ్ అనే వ్యాపమ్ నిందితుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఇది ఆత్మహత్య కాదని, హత్యేనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ ప్రాణాలకు ముప్పు వుందని, కాపాడాల్సిందిగా లేఖ రాశారు.