'వ్యాపమ్'పై సీబీఐ విచారణ జరిపించండి.. చౌహాన్ : సుప్రీంకోర్టు బోనులో వ్యాపమ్ పిటీషన్లు!
మధ్యప్రదేశ్ వ్యవసాయక్ పరీక్షా మండల్ (వ్యాపమ్) స్కామ్పై సీబీఐ విచారణ జరిపించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ రాష్ట్ర హైకోర్టును కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాయనున్నట్టు మంగళవారం ప్రకటించారు. మరోవైపు వ్యాపమ్ స్కామ్పై సీబీఐతో విచారణ జరిపించాలంటూ దాఖలైన 8 పిటీషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. వీటన్నింటిపై ఈనెల 9వ తేదీన విచారణ జరుపనుంది.
ఈ స్కామ్లో ఇప్పటివరకు 48 మంది అనుమానాస్పదంగా మృతి చెందిన విషయంతెల్సిందే. ముఖ్యంగా శని, ఆది, సోమవారాల్లో వరుసగా ముగ్గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. వీరిలో ఒకర జర్నలిస్టు కాగా, మరొకరు వైద్య కాలేజీ డీన్, ఇంకొకరు మహిళా ట్రైనీ ఎస్సై ఉన్నారు. ఈ మృతులతో వ్యాపమ్ స్కామ్పై దేశవ్యాప్తంగా చర్చ ఆరంభం కావడంతో పాటు... సీబీఐతో విచారణ జరిపించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి.
వీటిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. కోట్ల రూపాయల వ్యాపం కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టును కోరారు. ఈ మేరకు ఈ కేసులో సీబీఐ విచారణకు ఆదేశించాలని కోర్టుకు లేఖ రాస్తున్నట్టు తెలిపారు.
మరోవైపు ఈ స్కాంతో సంబంధం ఉన్న పలువురు వరుసగా చనిపోతుండటంతో సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ ఇప్పటికే కోర్టులో పిటిషన్లు దాఖలదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 9 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. వీటిలో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్లు దాఖలు చేసిన పిటీషన్లు కూడా ఉన్నాయి. వీటిన్నింటిపై ఈ నెల 9న వాటిపై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.