గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వాసుదేవన్
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (12:12 IST)

జయప్రద కంట కన్నీరు.. యాసిడ్‌ దాడులు చేస్తామని బెదిరించారట

ఇటీవల భాజపాలో చేరిన ప్రముఖ అందాల నటి జయప్రద కన్నీరు పెట్టుకున్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌ నియోజవర్గం నుండి పోటీ చేస్తున్న జయప్రద... ఈ సందర్భంగా రామ్‌పూర్‌లో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొని... ఓట్లు వేయమని కోరడంతోపాటు కన్నీళ్లు పెట్టుకుంటూనే ప్రతిపక్ష నేతలపై ఆరోపణలు కూడా గుప్పించేసారు.
 
వివరాలలోకి వెళ్తే... ప్రచార సభలో మాట్లాడిన ఆవిడ... భాజపా తనకు పుట్టిన రోజు కానుకగా రామ్‌పూర్‌ టికెట్‌ను బహుమతిగా ఇచ్చిందనీ... దీని ద్వారా తాను మరోసారి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని పొందానని చెప్పుకొచ్చారు. కానీ సమాజ్‌వాదీ పార్టీ నేత అజాం ఖాన్‌ తన మీద ఎన్నో ఆరోపణలు చేసారన్నారు.

తనను రామ్‌పూర్‌ నుంచి వెళ్లిపోవాలంటూ డిమాండ్‌ చేసారనీ... వెళ్లకపోతే యాసిడ్‌ దాడులు చేస్తామని బెదిరించారనీ బోరున విలపించారు. వెంటనే అక్కడున్న భాజపా కార్యకర్తలందరూ వేదిక వద్దకు వచ్చి ఆమెను ఓదార్చుతూ... ఎన్నికలు పూర్తయ్యే వరకు జయప్రదకు మద్దతుగా ఉంటామంటూ ప్రతిజ్ఞ చేసారు.
 
కొంత సేపటి తర్వాత ఆవిడ మళ్లీ మాట్లాడుతూ... తొలిసారి తన వెనుక భాజపా బలం ఉందనీ... ఇంతకు ముందులా ఇంకెప్పుడూ ఏడవబోననీ... తనకు బతికే హక్కుందనీ... బతుకుతాననీ... తనను ఎవ్వరు ఏమీ చేయలేరనీ... భాజపాలో చేరతానంటే తనను కొందరు హెచ్చరించారనీ చెప్పారు. 

కానీ ప్రజాసేవకు ఈ పార్టీయే తనకు మంచిదిగా తోచిందని చెప్పుకొచ్చారు. తాను గెలవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పిన ఆవిడ... మరోసారి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇమ్మని దేవుడిని కోరుకుంటున్నాను. ఆయన ఆశీర్వాదంతోపాటు మీ ఆశీర్వాదం కూడా కావాలి అని ముగించడం జరిగింది.
 
మరి హామీలకు కూడా పడని ఓటర్లు ఎవరైనా ఉంటే నేతల కన్నీళ్లకు పడిపోతారేమో... మన నేతలు కూడా ఇదే సూత్రం ఫాలో అయితే బాగుంటుందేమో... ఒకసారి ట్రై చేసి చూస్తారా...