శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జులై 2020 (14:18 IST)

వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ సోమెన్ హఠాన్మరణం - సోనియా సంతాపం

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమెన్ మిత్రా హఠాన్మరణం చెందారు. గురువారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 78 ఏళ్ల ఈ సీనియర్ నేత చౌరంగీ జిల్లాలోని సీల్దా నియోజకవర్గం నుంచి 1972లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన మిత్రా, ఆ తర్వాత ఏడు సార్లు ఆ నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 
 
2008లో అభిప్రాయభేదాలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మిత్రా, తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2009లో డైమండ్ హార్బర్ నియోజక వర్గం నుంచి టీఎంసీ పార్టీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే, 2014లో తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 
 
కిడ్నీ, హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న మిత్రాను ఈ నెల మొదట్లో కోల్‌కతాలోని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మిత్రాకు భార్య, కుమారుడు ఉన్నారు.
 
సోమెన్ మిత్రా మృతితో కాంగ్రెస్ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. ఆయన మృతితో ఓ మంచి నాయకుడిని కోల్పోయినట్టు పార్టీ ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన నేతలు.. సోమెన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే, పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు.. రాహుల్ గాంధీలు సంతాపాన్ని వ్యక్తం చేశారు.