తల్లీకూతుళ్ళను చంపేసి... సూట్కేసులో పెట్టి గంగానదిలో విసిరేశారు..
తన శారీరక అవసరాలను తీర్చుకున్నాడు. దరి చేర్చుకున్నట్లు నటించారు. పెళ్ళి చేసుకొమ్మని నిలదీస్తే, తల్లీకూతుళ్ళనిద్దరిని కర్కశంగా చంపేసి ముక్కలు చేసి, ఓ సూట్కేసులో పెట్టి గంగానదిలో విసిరేసి చేతులు దులుపుకున్నాడు. దారుణ సంఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.
45 ఏళ్ల సమరేశ్ సర్కార్ అనే వ్యక్తి షెరాపులిలో బ్యాంకు మేనేజర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అతడికి అప్పటికే ఓ భార్య తిటాగఢ్ అనే చోట ఉండగా తాను విధులు నిర్వర్తిస్తున్న చోట సుచేత చక్రవర్తి అనే 34 ఏళ్ల మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. గత కొంత కాలంగా ఈ వ్యవహారం నడుస్తుండగా ఆమె ఇటీవల తనను వివాహం చేసుకోవాల్సిందిగా సమరేశ్ను డిమాండ్ చేసింది.
దీంతో భార్యకు భయపడిన అతడు సుచేతను, ఆమెకు అప్పటికే ఉన్న ఐదేళ్ల పాపను హతమార్చి ఇద్దరి మృతదేహాలను సూట్కేసులలో పెట్టి గంగా నదిలో విసిరేశాడు. ఇది తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి వారి మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. అతడిని 12 రోజులపాటు రిమాండ్కు తరలించారు.