తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి జయలలితపై ఎనలేని అభిమానం చూపే ప్రజలు, అభిమానులు ఆమెను ముద్దుగా 'అమ్మ' అని పిలుచుకుంటారు. అలాంటి అమ్మకు ఓ వీరాభిమాని తన కాళ్లు, చేతులపై మేకులు కొట్టించుకుని శిలువపై వేలాడి, తన వీరాభిమానాన్ని చాటుకున్నాడు.
తమిళనాడు మాజీ సీఎం జయలలిత కోసం ఆమె వీరాభిమాని, కరాటే మాస్టర్ షిహన్ హుస్సైని శిలువ ధరించారు. కాలికి, చేతికి మేకు ధరించి ఆమె పుట్టిన రోజు (మంగళవారం- ఫిబ్రవరి24)ను పురస్కరించుకుని పది కాలాల పాటు చల్లగా ఉండాలని, మళ్లీ సీఎం కావాలని ఆశించారు.
పొడవాటి మేకులను కాలికి చేతికి కొట్టించుకుని జీసస్ తరహాలో అమ్మకోసం శిలువ ధరించి కాసేపు జయలలితను కొనియాడారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అమ్మ త్వరలో సీఎం కావాలని ఆకాంక్షించారు. ఆరు నిమిషాల పాటు హుస్సైని అమ్మ కోసం శిలువలోనే ఉండిపోయారు.
కాగా గతంలో అమ్మ కోసం కరాటే మాస్టర్ హుస్సైని రక్తంతోనే జయమ్మ చిత్రపటాన్ని గీశారు. తర్వాత తన రక్తంతో అమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. తన వీరాభిమానాన్ని చాటుకున్నారు.