శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 నవంబరు 2015 (11:40 IST)

షీనా చంపేశాక కోల్‌కతాకు వచ్చి పార్టీ చేసుకున్న ఇంద్రాణి - సంజీవ్ ఖన్నా?

తన కుమార్తె షీనా బోరాను చంపేసి మృతదేహాన్ని పాతిపెట్టిన తర్వాత కోల్‌కతాకు వచ్చిన ఇంద్రాణి, ఆమె మాజీ రెండో భర్త సంజీవ్ ఖన్నాలు పార్టీ చేసుకున్నారు. ఇది సీబీఐ దర్యాప్తులో తాజాగా వెలుగు చూసింది. ఈ విషయాన్ని సంజీవ్ ఖన్నా బెస్ట్ ఫ్రెండ్ మంగలేష్ జలన్ అనే వ్యక్తి సీబీఐకు ఇచ్చిన లిఖితపూర్వక వాంగ్మూలంలో వెల్లడించారు. 
 
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు విచారణను సీబీఐ చేపట్టిన తర్వాత అనేక విషయాలు వెలుగు చూస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా సంజీవ్ ఖన్నా స్నేహితుడు జలన్ వద్ద సీబీఐ విచారించగా, ఆయన అనేక విషయాలను బహిర్గతం చేశారు. షీనాను హత్య చేసిన మరుసటి రోజు తన రెండో భర్త సంజీవ్ ఖన్నాతో కలసి ఇంద్రాణి 'కోల్‌కతా క్రికెట్ అండ్ ఫుట్ బాల్ క్లబ్'లో పార్టీ చేసుకుందని తెలిపారు. రాయ్‌గడ్‌లో షీనా మృతదేహాన్ని పాతిపెట్టిన తర్వాత ఇద్దరూ కోల్‌కతాకు వచ్చారని, ఏప్రిల్ 25, 2012 రాత్రి, వీరిద్దరినీ క్లబ్‌లో చూసినట్టు చెప్పారు. 
 
ఆ సమయంలో సంజీవ్ ఖన్నా ఓల్డ్‌మంక్ రమ్ము తాగాడని, ఇంద్రాణి బీర్ తీసుకుందని తెలిపారు. ఆపై పీటర్ ముఖర్జియాను పికప్ చేసుకునేందుకు ఏప్రిల్ 27న ఆమె ముంబై వెళ్లిపోయిందని సీబీఐ అధికారులకు జలన్ చెప్పారు. 1987, 88 నుంచి తాను క్లబ్ సభ్యుడినని, తాను సంజీవ్ ఖన్నాకు స్నేహితుడినని, ఇంద్రాణితో ఎన్నడూ మాట్లాడలేదని తానిచ్చిన లిఖితపూర్వక స్టేట్‌మెంట్‌లో జలన్ తెలిపారు. సంజీవ్ - ఇంద్రాణికలకు పట్టిన బిడ్డ విధి భవిష్యత్‌కు షీనా అడ్డురావచ్చన్న ఆలోచనతోనే ఆమెను హత్య చేసేందుకు సంజీవ్ సహకరించివుండొచ్చని సీబీఐ భావిస్తోంది.