శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 12 మార్చి 2019 (16:25 IST)

ఆస్తి కోసం ప్రియుడితో కలిసి తల్లిదండ్రులను హత్య చేసిన మహిళ

ఆస్తి కోసం ప్రియుడితో కలిసి కన్నవారిని చంపింది ఓ మహిళ. టీలో నిద్రమాత్రలు కలిపి ఈ దారుణానికి ఒడిగట్టింది. వివరాల్లోకి వెళితే, ఢిల్లీ శివారులోని దీపక్‌ విహార్‌కు చెందిన 26 సంవత్సరాల దవిందర్‌ కౌర్ అనే వివాహిత ఒక యేడాది కాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. 
 
ఈమెకు లక్నోకు చెందిన ప్రిన్స్‌ దీక్షిత్‌ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త సాహజీవనానికి దారితీసింది. కౌర్ తల్లిదండ్రులకు ఢిల్లీలోని దీపక్‌ విహార్‌లోని నిలోథి ఎక్స్‌టెన్షన్‌లో విలువైన స్థలం ఉంది. దాన్ని తన పేరు మీద రాయాలని తల్లిందండ్రులపై ఆమె ఒత్తిడి చేయగా, అందుకు వారు నిరాకరించారు. 
 
దీంతో తన ప్రియుడితో కలిసి కన్న తల్లిదండ్రులను హత్య చేయాలని ప్లాన్ చేసింది. తల్లి జగీర్‌ కౌర తండ్రి అంత్యక్రియల నిమిత్తం గత నెల 10వ  జలంధర్‌కి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న తండ్రి గుర్మీత్‌సింగ్‌కు 21వ తేదీన దవిందర్‌ నిద్రమాత్రలు కలిపి టీ ఇచ్చింది. కూతురు ప్రేమగా టీ ఇచ్చిందని తీసుకుని తాగిన అతను మత్తులోకి జారుకున్నాడు. 
 
అప్పుడు ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి దిండుతో కప్పి ఊపిరి ఆడకుండా చేసి తండ్రిని చంపేసింది. శవాన్ని సూట్‌కేస్‌లో కుక్కి సయీద్‌ నంగ్లోయి గ్రామ సమీపంలోని కాలువలో పడేశారు. ఈ నెల 2న ఇంటికి తిరిగొచ్చిన తల్లిని కూడా ఇదే ప్రణాళికతో టీలో మత్తుమందు కలిపి దిండుతో అదిమి చంపేశారు. ఆ శవాన్ని కూడా సూట్‌కేస్‌లో కుక్కి కాలువలో పడేశారు. 8, 9 తేదీల్లో వరుసగా సూట్‌కేస్‌లు బయటపడటంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారణ జరిపారు. దవిందర్‌, ప్రిన్స్‌ దీక్షిత్‌‌ల కాల్ డేటాని సేకరించారు. సీసీటీవీ ఫూటేజీ ఆధారంగా నేరస్తులను పట్టుకున్నారు.