గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 31 మే 2016 (10:46 IST)

కోల్‌కతాలో దారుణం : కారులో తిప్పుతూ 3 గంటల పాటు సామూహిక అత్యాచారం!

భారతదేశంలో అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. మహిళలు, యువతులు చివరకు మైనర్ల‌పై కూడా కామాంధులు అత్యాచారాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకున్నా... నిర్భయ చట్టం అమల్లో ఉన్నా ఈ అత్యాచారాలకు మాత్రం అడ్డుకట్టవేయలేక  పోతున్నారు. తాజాగా కదులుతున్న కారులో.. మూడు గంటల పాటు నలుగురు వ్యక్తులు ఓ అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణం పశ్చిమబెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... స్థానిక బార్‌లో పనిచేస్తున్న మహిళ తన షిఫ్టు ముగించుకుని అనంతరం సెక్టార్ 5లోని ఓ కేఫ్‌కు వెళ్ళాలనుకుంది. కేఫేకు వెళ్లడానికి మొబైల్ యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకుని, సాల్ట్ లేక్ సెక్టార్ 5లోని ఆర్‌డీబీ సినిమాస్ వద్ద దిగింది. అంతలోనే ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తి సాయం చేస్తానంటూ ముందుకొచ్చి ఫోన్లో మాట్లాడాడు. కాసేపటి తర్వాత ఉన్నట్టుండి ఓ కారు ఆమె ముందుకు ఆగింది. అందులోని ఉన్నవాళ్లు ఆమెను బలవంతంగా లోపలికి లాగారు. 
 
లోపల నలుగురు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు ఆమెపై కదులుతున్న కారులోనే అతికిరాతకంగా అత్యాచారం చేశారు. ఉదయం 3.30 గంటల సమయంలో కారు ఓ కాలువ దగ్గర ఆగినప్పుడు ఆమె కారు అద్దం తెరిచి, గట్టిగా కేకలు పెట్టింది. దీంతో భయపడిన ఆ నలుగురూ ఆమెను కారులోంచి బయటకు నెట్టేశారు. తీవ్రంగా గాయాలతో రక్తపు మడుగులో ఉన్న ఆమెను ఓ టాక్సీ డ్రైవర్ చూసి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆమె శరీరంపై గాయాలున్నాయని వైద్యులు తెలిపారు. పరారీలో ఉన్న నలుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.