‘టాయిలెట్ కడితేనే కాపురానికొస్తా’! బీహార్లో మరో మహిళ సంచలనం
గతంలో మరుగుదొడ్డి నిర్మాణం కోసం మంగళసూత్రాన్ని అమ్మివేసిన ఓ మహిళ వార్తల్లోకెక్కింది. తాజాగా బీహార్లో టాయిలెట్ కట్టిస్తేనే కాపురానికొస్తానంటూ మరి మహిళ సంచలనం సృష్టించింది. పాట్నా జిల్లాలోని బిక్రమ్ గ్రామానికి చెందిన కార్పెంటర్ రాకేశ్ శర్మతో బాబ్లీ దేవి(20)కి గతేడాది వివాహం జరిగింది. ఆ సమయంలో ఇంటి వద్ద టాయిలెట్ కట్టించాలంటూ ఆమె కోరగా అందుకు అంగీకరించిన రాకేశ్ తర్వాత పట్టించుకోలేదు. చివరికి మరుగుదొడ్డి నిర్మాణానికి తిరస్కరించాడు.
ఈ విషయమై వారి మధ్య వాగ్వాదం జరగడంతో ఆమెను రాకేశ్ కొట్టాడు. దీంతో విసిగిపోయిన బాబ్లీ దేవి ఇక లాభం లేదనుకుని పుట్టింటికి పయణమైంది. పనిలోపనిగా తన భర్త మరుగుదొడ్డిని కట్టించేలా చూడాలని కోరుతూ పాట్నా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది.
మరుగుదొడ్డి కట్టేదాకా ఆ ఇంటికి రానంటూ తెగేసి చెప్పింది. బహిర్భూమికి వెళ్లడం మహిళకు సిగ్గుచేటు అని, ఇది ఆరోగ్యం, గౌరవం, హుందాతనానికి సంబంధించిన విషయం అని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.