గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 7 నవంబరు 2018 (17:05 IST)

మంత్రశక్తిని పెంచుకునేందుకు చిన్నారి గొంతుకోసి చంపిన మహిళ

తమిళనాడు రాష్ట్రంలోని పుదుక్కోట్టై జిల్లాలో దారుణం జరిగింది. సోది చెప్పడంలో తన ప్రావీణ్యాన్ని నిరూపించుకునేందుకు, తన మంత్రిశక్తిని పెంచుకునేందుకు వీలుగా ఓ చిన్నారి గొంతుకోసి చంపేసిందో మహిళ. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పుదుక్కోటై జిల్లా కరుంపట్టికి చెందిన పళనిస్వామి (35) అనే వ్యక్తి ఓ భవన నిర్మాణ కార్మికుడు. ఈయనకు షాలిని అనే నాలుగేళ్ళ కుమార్తె ఉంది. గత నెల 25వ తేదీన ఇంటికి సమీపంలో ఆటలాడుకుంటుండగా కనిపించకుండా పోయింది. ఆ తర్వాత గ్రామం మొత్తం గాలించగా, తమ ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న బ్లేడుతో గొంతుకోసి చంపేసిన మృతదేహాన్ని గుర్తించారు. 
 
శవం దొరికిన ప్రదేశంలో సెమ్ముని ఆలయం ఉండడంతో బాలికను బలి ఇచ్చి ఉండొచ్చనే కోణంలో ఇలుప్పూరు పోలీసులు విచారణ ప్రారంభించారు. అదే ప్రాంతానికి చెందిన సోది చెప్పే శింగారం భార్య చిన్నపిల్లై (47) అనే మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె చేతిలో సైతం బ్లేడుతో కోసుకున్నట్లుగా గాయం ఉండటంతో విచారణను తీవ్రతరం చేసి చిన్నపిల్లైని సోమవారం అరెస్టు చేశారు. 
 
ఆమె వద్ద పోలీసులు జరిపిన విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'గత కొన్నేళ్లుగా సోది చెపుతూ జీవిస్తున్నాను. తాను దేవుడి పూనినట్లుగా ఆడటం, సమీపంలోని అడవిలో ఉన్న సెమ్ముని ఆలయంలో కోడి, పొట్టేలు, గొర్రెలను బలిఇచ్చి సోది చెబుతుంటాను. నరబలి ఇవ్వడం ద్వారా నా మంత్రశక్తి పెంచుకోవాలని భావించాను. 
 
ఇందుకోసం తన ఇంటికి సమీపంలో నివశించే షాలినిని ఎంచుకున్నాను. షాలినీని ఎత్తుకెళ్లేందుకు సమయం కోసం ఎదురుచూస్తుండగా గతనెల 25వ తేదీన ఒంటరిగా ఆడుకుంటోంది, జనసంచారం పెద్దగా లేకపోవడంతో షాలినీని చంకనవేసుకున్నాను. బాగా పరిచయం ఉండడంతో మారం చేయకుండా నాతో వచ్చేసింది. నేరుగా సెమ్ముని ఆలయంకు వెళ్లి పూజలు చేసి నా వద్దనున్న బ్లేడుతో షాలిని గొంతుకోసి బలిచ్చాను. ఆ తరువాత శవాన్ని ఆలయానికి దూరంగా విసిరివేసి ఇంటికి వెళ్లిపోయాను' అని చెప్పుకొచ్చింది.