గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2016 (15:27 IST)

మద్యం కొనివ్వలేదని భర్తపై అలిగి భార్య ఆత్మహత్య... ఎక్కడ?

భర్త మద్యం కొనివ్వలేదని భావించి.. ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుప్పూరు జిల్లాలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... తిరుప్పూరు చాముండిపురానికి చెందిన పార్థసారథి (25), జ్యోతి (23) అనే భార్యాభర్తలు. వీరికి ఓ యేడాది కుమారుడు ఉన్నాడు. పార్థసారథి మద్యానికి బానిస. రోజూ రాత్రి పూట తాగి ఇంటికి వచ్చేవాడు. తాగుడు మానమని జ్యోతి భర్తను వేడుకునేది. అయినా పార్థసారథి భార్య మాటలను ఏనాడూ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. 
 
చివరకు ఓ రోజు భర్త తన వెంట తెచ్చుకున్న బ్రాందీ సీసాను చూసిన జ్యోతి తన భర్తను పీడిస్తున్న ఆ మద్యంలో ఏముందో తెలుసుకోవాలనుకున్న కుతూహలంతో గటగటా తాగేసింది. ఇక మరుసటి రోజు నుంచి ఆ ఇంట వింత ఆచారం ప్రారంభమైంది. ప్రతిరోజూ రాత్రిపూట భార్యభర్తలు మద్యాన్ని కలిసి సేవించేవారు. చివరకు పరిస్థితి ఎంతవరకు వచ్చిదంటే మద్యం లేకపోతే బతకలేననే స్థితికి జ్యోతి చేరుకుంది. 
 
అయితే, అతిగా మద్యం సేవించడం వల్ల భార్య అనారోగ్యానికి గురైంది. దీంతో భర్త మద్యం సీసాలు తేవడం మానుకున్నాడు. దీంతో జ్యోతి భర్తపై అలిగింది. మంగళవారం రాత్రి పార్థసారథి ఇంటికి రాగానే జ్యోతి మద్యం సీసా తెచ్చావా అంటూ అడిగింది. వట్టిచేతులతో వచ్చానని భర్త చెప్పడంతో జ్యోతి బిగ్గరగా కేకలు పెడుతూ గొడవపడింది. వెంటనే మద్యం సీసా కొని తెమ్మని ఆగ్రహంతో ఊగిపోయింది. 
 
భార్య పరిస్థితిని గమనించి పార్థసారథి కొడుకును తీసుకుని ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. కొన్ని గంటల తర్వాత పార్థసారథి ఇంటికి రాగా గదిలో ఉరిపోసుకుని శవంగా వేలాడుతున్న భార్యను చూసి దిగ్భ్రాంతి చెందాడు. ఆ తర్వాత తేరుకుని స్థానిక పోలీసులకు సమాచారం చేరవేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.