గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 12 జనవరి 2017 (04:51 IST)

ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఎ క్రొకొడైల్ ఫెస్టివల్ అంటున్న మన్మోహన్

శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ముందుంది ముసళ్ల పండుగ సామెతను మక్కీకి మక్కీకిగా ఇంగ్లీషులోకి అనువదించి చిరంజీవి చేసిన వీర కామెడీ పదేళ్ల తర్వాత కూడా జనం నోళ్లలో నానుతూనే ఉంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి ఈ విషయం తెలుసో లేదో గానీ ఆయన పెద్దనోట్ల రద్దు

శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ముందుంది ముసళ్ల పండుగ సామెతను మక్కీకి మక్కీకిగా ఇంగ్లీషులోకి అనువదించి చిరంజీవి చేసిన వీర కామెడీ పదేళ్ల తర్వాత కూడా జనం నోళ్లలో నానుతూనే ఉంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి ఈ విషయం తెలుసో లేదో గానీ ఆయన పెద్దనోట్ల రద్దు ఫలితాల విషయంలో ఇన్ ఫ్రంట్ దేరీజ్ ఎ క్రోకోడైల్ ఫెస్టివల్ అంటున్నారు. 
 
తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టి, కొంత దేశభక్తి మసాలాను దట్టంగా కూర్చి ప్రధాని నరేంద్రమోదీ ఏకపక్షంగా ప్రకటించిన పెద్దనోట్ల రద్దు వ్యవహారం దేశం పీకలమీద నేటికీ కూర్చునే ఉంది. కానీ అప్పుడే ఏమింది అధ్వాన పరిస్థితులు ఇంకా దేశంలో ఇంకా ఏర్పడ లేదంటూ మన్మోహన్ సింగ్ దేశ ప్రజలను హెచ్చరించారు. దేశ భవితవ్యాన్నే సంస్కరణల బాట పట్టించి, సరళీకరణకు తలుపులు తెరిచిన మాజీ ఆర్థికమంత్రి గత పాతికేళ్లుగా దేశంలో జరుగుతున్న ప్రతి ఆర్థిక సంస్కరణనూ సమర్థిస్తూ వస్తుండటం తెలిసిందే కానీ పెద్దనోట్ల రద్దు విషయంలో ఆయన పూర్తిగా రివర్స్‌కు తిరిగి విమర్శలు గుప్పిస్తూనే ఉండటం గమనార్హం.
 
మోదీ ప్రారంభించిన పెద్ద నోట్ల రద్దు భయంకరమైన నిర్వహణా లోపంగా గతంలోనే విమర్శించిన మాజీ ప్రధాని దేశం ఇంకా ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొనబోతోందని హెచ్చరించారు. 
 
భారత ఆర్థిక వ్యవస్థను మార్చివేస్తానని మోదీ పదే పదే చెబుతున్నారు. కానీ మనం ఇంకా ఆ మార్పు ప్రారంభ దశలోనే ఉన్నాం. భయంకరమైన పరిస్థితులు యింకా ఎదురుకాలేదని మన్మోహన్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సదస్సులో పాల్గొన్న మన్మోహన్ కేంద్రప్రభుత్వం ఇప్పుడు ప్రకటిస్తున్న వృద్ధి మాట అసత్యం అని విమర్శించారు.  గత రెండేళ్లలో పెరిగిన జాతీయాదాయం గురించి మోదీ చేస్తున్న ప్రచారం వట్టిదేనని రుజువైందని అన్నారు. 
 
పెద్దనోట్ల రద్దు దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. గత కొన్ని నెలలుగా ఘటనలు చెడు నుంచి ఇంకా చెడువైపుకు మళ్లాయి. కొంతమది జీడీపీ 6.3 శాతానికి తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. అప్పుడు గానీ పెద్దనోట్ల రద్దు విధ్వంసం మనకు బోధపడదని మాజీ ప్రధాని చెప్పారు. జీడీపీ పతనం అయిందంటే, ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. ఉత్పత్తి పడిపోతుంది. వ్యవసాయ ఆదాయం కుప్పగూలుతుంది. పెద్దనోట్ల రద్దు భవిష్యత్తులో చేసే విధ్వంసం ఇదేనని మన్మోహన్ హెచ్చరించారు.. 
 
ప్రభుత్వం పారా హుషార్ అంటూ అంతా బాగుందని గప్పాలు కొట్టుకుంటున్నా, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు భారత జీడీపీ అంచనాలను తగ్గిస్తున్నాయి. మన వృధ్ధి రేటు 7 శాతంగా ఉంటుందని చెప్పుకుంటన్నా, ఇంకా పడిపోయే అవకాశముందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. ఆర్థిక వ్యవస్థ లోని పలురంగాలు గణనీయ స్థాయిలో పతనం కావడానికి పెద్దనోట్ల రద్దు కారణమన్నది ప్రతి ఒక్కరి నోట వినిపిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఆర్థిక సంస్కరణల మార్గదర్శి మన్మోహన్ సైతం ముందుంది ముసళ్ల పండుగ అంటూండటం గమనార్హం.