శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (14:39 IST)

RGinUS : ప్రధాని అభ్యర్థిగా నేను సిద్ధం... రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన అమెరికాలో రెండు వారాల పాటు పర్యటించనున్నారు. ఇందులోభాగంగా, బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దే

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన అమెరికాలో రెండు వారాల పాటు పర్యటించనున్నారు. ఇందులోభాగంగా, బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... కాంగ్రెస్‌ పార్టీ తరుపున వచ్చే సాధారణ ఎన్నికల్లో తాను ప్రధాని అభ్యర్థిగా రేసులో దిగేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 
 
అయితే రాహుల్‌ మాట్లాడుతుండగా.. ఓ వ్యక్తి లేచి 'మీరు కాంగ్రెస్‌ పార్టీ తరుపున ప్రధాని అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా' అని ప్రశ్నించారు. దానికి రాహుల్‌ స్పందిస్తూ, 'నేను అందుకోసం తప్పకుండా సిద్ధంగా ఉంటాను. మాది ఆర్గనైజేషనల్‌ పార్టీ.. అందుకే ఆ విషయాన్ని పార్టీ తేలుస్తుంది. అది ప్రస్తుతం ఈ విషయంపైనే పనిచేస్తుంది. కాంగ్రెస్‌ పార్టీ ఆ నిర్ణయం తీసుకుంటుంది' అంటూ సమాధానమిచ్చారు. 
 
అలాగే, తనపై జరుగుతున్న దుష్ప్రచారం గురించి రాహుల్ స్పందిస్తూ... బీజేపీ యంత్రంలో 1,000 మంది కుర్రాళ్ళు ఉన్నారన్నారు. వారంతా తనపై అవాకులు, చవాకులు ప్రచారం చేస్తూ ఉంటారన్నారు. విముఖ రాజకీయ నేత, మూర్ఖుడు అంటూ తన గురించి ప్రచారం చేస్తూ ఉంటారన్నారు. 'ఈ ఆపరేషన్‌ను మా దేశాన్ని నడుపుతున్న పెద్ద మనిషి నిర్వహిస్తున్నాడు' అని పేర్కొన్నారు. అంటే పరోక్షంగా ప్రధాన మంత్రి మోడీపై ఆయన ఈ విమర్శలు గుప్పించినట్లు స్పష్టమవుతోంది.
 
అదేసమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన కంటే మంచి వాగ్ధాటిగల నేత అని రాహుల్ చెప్పారు. జనంలో మూడు, నాలుగు వర్గాలకు ఎలా సందేశం ఇవ్వాలో మోడీకి బాగా తెలుసునన్నారు. అయితే మోడీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని విమర్శించారు. తనతో కలిసి పని చేసేవారితో కూడా ఆయన ఏ విషయాన్నీ చెప్పరని ఆరోపించారు. ఈ వివరాలను తనతో బీజేపీ నేతలు చెప్పి వాపోయారని రాహుల్ బహిర్గతం చేశారు.