శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 31 మార్చి 2015 (10:21 IST)

కొత్త పార్టీ ఏర్పాటు దిశగా యోగేంద్ర - ప్రశాంత్ భూషణ్‌లు!

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలు రోజుకో విధంగా మారిపోతున్నాయి. ఆ పార్టీ జాతీయ కౌన్సిల్ నుంచి బహిష్కరణకు గురైన పార్టీ సీనియర్ నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లు కొత్త పార్టీని స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదే జరిగితే ఆప్‌కు పక్కలో బల్లెంలా మారనుంది. 
 
పలు కీలక అంశాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌పై బహిరంగంగా విమర్శలు ఎక్కుపెట్టిన వీరిద్దరిపై ఇటీవలే పార్టీ చర్యలు తీసుకుంది. పార్టీ చర్యలను తీవ్రంగా పరిగణించిన వీరిద్దరూ పార్టీలో అసంతృప్తులను దరిచేర్చి కొత్త పార్టీని స్థాపించాలని యోచిస్తున్నారు. 
 
ఇందులోభాగంగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14వ తేదీన తమ మద్దతుదారులతో కీలక భేటీ నిర్వహించేందుకు వీరు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. 
 
ఆప్‌లో లోక్‌పాల్ స్థానం నుంచి బహిష్కరణకు గురైన రాందాస్‌తో పాటు పార్టీని వీడిన సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ తదితరులను కూడా వీరు తమ భేటీకి ఆహ్వానిస్తున్నారు. వీరి యత్నాలు ఫలించి కొత్త పార్టీ అవతరిస్తే, కేజ్రీవాల్‌కు నిజంగా పక్కలో బల్లెం తయారైనట్టే.