శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2014 (09:53 IST)

నిజంగానే రాష్ట్రపతిని అవుతానా? : రాజస్థాన్‌ జ్యోతిష్యుడి ఇంట్లో స్మృతి ఇరానీ!

ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ భవిష్యత్‌లో భారత రాష్ట్రపతి అవుతారంటూ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ జ్యోతిష్యుడు చెప్పిన భవిష్యవాణితో స్మృతి ఇరానీ ఉబ్బితబ్బిబ్బులై పోతోంది. నిజంగా ఆమె రాష్ట్రపతి అవుతారో లేదో తెలియదు కానీ, జ్యోతిష్యుడి భవిష్య వాణికి మాత్రం ఆమె పొంగిపోతోంది. దీంతో రాజస్థాన్‌ వెళ్లిన స్మృతి ఇరానీ సోమవారం అక్కడి భిల్వారాలోని ఓ జ్యోతిష్యుడిని కలిశారు. ఆయనంటే స్మృతికి నమ్మిక ఎక్కువ. 
 
ఎందుకంటే.. గతంలో టీవీ నటిగా ఉన్నప్పుడు స్మృతి ఆయనను కలిశారు. అప్పుడు ‘నువ్వు మంత్రి అవుతావు’ అని చెప్పారట. తర్వాత ఆమె మంత్రి అయ్యారు. దాంతో ఇప్పుడు మళ్లీ కలిశారు. ఈసారి.. ‘నువ్వు రాష్ట్రపతి అవుతావు’ అని సదరు జ్యోతిష్యుడు చెప్పారు. అయితే, కేంద్ర మంత్రిగా ఉండి ఆమె జ్యోతిష్యుడిని కలవడం వివాదాస్పదమైంది. ‘‘వ్యక్తిగత జీవితంలో నేను ఏం చేస్తున్నానన్నది ప్రజలకు సంబంధించిన అంశం కాదు. టీఆర్పీ రేటింగ్‌లు పెంచుకోవడానికే దీనిని వివాదం చేస్తున్నారు. దీని ద్వారా మీకు డబ్బులు వస్తాయంటే నాకు సంతోషమే’’ అని స్మృతి వ్యాఖ్యానించారు. ఎంపీ అయిన తర్వాత నటనకు స్వస్తి పలికానని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు.