గోంగూర ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలి?
ఎప్పుడూ రొయ్యల గ్రేవీ, రొయ్యల బిర్యానీ, రొయ్యల పులావ్ చేస్తున్నారా..? రొయ్యల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉండే అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇది మంచి ఫ్లేవర్తో పాటు, మంచి రుచిని కూడా కలిగి ఉంటాయి. అలాంటి రొయ్యలతో గోంగూర కాంబినేషన్లో గ్రేవీ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం..
కావల్సిన పదార్థాలు:
గోంగూర: ఒక కప్పు
రొయ్యలు: ఒక కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక టేబుల్ స్పూన్
ఉల్లిపాయ తరుగు : అర కప్పు
పచ్చిమిర్చి-ఎండుమిర్చి పేస్ట్ : ఒక స్పూన్
పోపుదినుసులు : వేపుడుకు సరిపడా
నెయ్యి: నాలుగు టేబుల్ స్పూన్లు
టమోటో గుజ్జు : ఒక కప్పు
ధనియాలపొడి : టీ స్పూన్
కారం : రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి తగినంత
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీర తరుగు : కొద్దిగా
పసుపు: పావు స్పూన్
తయారీ విధానం:
ముందుగా శుభ్రం చేసుకున్న గోంగూరను గిన్నెలో సరిపడా నీళ్లు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో పాన్లో నెయ్యి వేసి, వేడయ్యాక అందులో రొయ్యలు వేసి లైట్గా వేగించి, తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో అదే నెయ్యిలో ఎండుమిర్చి, పోపుదినుసులు వేసి ఒక నిముషం వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి.
తర్వాత ఉడికించి పెట్టుకున్న గోంగూర, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత ధనియాల పొడి, వేయించిన రొయ్యల్ని వేసి, మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. 10నిముషాల తర్వాత, కొత్తిమీర తరుగు చల్లి దింపేస్తే సరిపోతుంది. నోరూరించే గోంగూర రొయ్యల కర్రీ రెడీ. ఇది అన్నంలోకి, రోటీల్లోకి చాలా రుచికరంగా ఉంటుంది.