శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By సందీప్ రేవిళ్ళ
Last Updated : బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (16:58 IST)

ఓకే.. ఇక మీరు ఇండియా ఇంటికెళ్లొచ్చు... తెలుగు విద్యార్థులకు అమెరికా....

అమెరికా వేసిన ఫార్మింగటన్ ఫేక్ యూనివర్శిటీ వలలో చిక్కుకున్న విద్యార్ధులకు ఊరట లభించింది. అరెస్ట్ అయిన 16 మంది స్వచ్ఛందంగా తిరిగి స్వదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అరెస్ట్ అయిన నిందితులను కేలహోన్ కౌంటీ, మన్రో కౌంటీ జైళ్లలో వేసారు. ఈ కేసులో మొత్తం 20 మంది అరెస్టు కాగా ముగ్గురికి గతంలోనే వాలంటరీ డిపార్చర్ అనుమతి దక్కింది, ఆ ముగ్గురిలో ఇద్దరు భారతీయులు, ఒక పాలస్తీనియన్ ఉన్నారు. 
 
ఈ కేసుకు సంబంధించి కోర్టులో తుది వాదనలు మంగళవారం జరగగా, విద్యార్థులు ఫిబ్రవరి 26లోగా తిరిగి స్వదేశాలకు వెళ్లాలని న్యాయస్థానం ఆదేశించింది. మిగతా 17 మందిలో 15 మందికి ఇప్పుడు వాలంటరీ డిపార్చర్ లభించింది. వీరిలో ఎనిమిది మంది తెలుగు విద్యార్థులు. మరో ఇద్దరిలో ఒకరు యూఎస్ సిటిజన్‌ని పెళ్లి చేసుకుని బెయిల్ బాండ్ కోసం దరఖాస్తు చేయగా మరో విద్యార్థికి యూఎస్ గవర్నమెంట్ రిమూవల్ కింద వెళ్లేందుకు అనుమతి వచ్చింది. 
 
మొత్తం 16 మంది స్వదేశాలకు వెళ్లనున్నారు. ఈ పూర్తి వ్యవహారంలో అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ విద్యార్థులకు చేయూతనిచ్చింది. కోర్టులో విద్యార్థుల తరఫున వాదించేందుకు అటార్నీలను ఏర్పాటు చేసారు. వెంకట్ మంతెన ఆధ్వర్యంలో ఆటా- తెలంగాణ ప్రతినిథులు విద్యార్థులకు సహకారం అందించాలంటూ కాంగ్రెస్ సభ్యురాలు ఎలిసా స్లాటికిన్‌కు విజ్ఞప్తి చేసారు.

దానికి స్పందించిన ఎలిసా స్లాటికిన్‌ ఇండియన్ ఎంబసీ,ఇతర అధికారులకు లేఖలు రాశారు. విద్యార్థుల తిరుగు ప్రయాణం విషయంలో ఇమిగ్రేషన్ అధికారులు సానుకూలంగా ప్రతిస్పందించారని అమెరికన్ తెలంగాణ అసోషియేషన్ ప్రతినిథులు తెలిపారు.