శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : గురువారం, 23 జూన్ 2016 (17:46 IST)

ఆదివారం దుర్గాపూజ ఎందుకు..? రాహువుకు శరీరమంతా విషమైతే.. తోకలో మాత్రం అమృతం ఉంటుందట!!

ఆదివారం రాహు కాల పూజ విశిష్టమైనది. రాహువుకు శరీరమంతా విషంతో నిండివుంటుంది. కానీ తోకలో మాత్రం అమృతం ఉంటుంది.

మహిళలు మంగళ, శుక్రవారాల్లో దుర్గాపూజ చేస్తుంటారు. దుర్గాదేవిని మంగళ, శుక్రవారాల్లో భక్తిశ్రద్ధలతో పూజించి.. కోరిన కోరికలు నెరవేరాలని సంకల్పించుకుంటారు. యువతులైతే వివాహ ప్రాప్తి కోసం.. వివాహితులైతే దీర్ఘసుమంగళీ ప్రాప్తం కోసం అమ్మవారిని పూజించడం విశ్వాసం. ముఖ్యంగా వారంలోని ఈ రెండు రోజుల్లో దుర్గాపూజ చేయడం ద్వారా మహిళలు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. 
 
ఇందులో మంగళవారం రాహుకాల పూజకు ప్రత్యేక విశిష్టత ఉంది. రాహు దోషాలు నివృత్తి కావాలంటే మంగళవారం రోజున రాహు కాలంలో దుర్గాదేవిని స్మరిస్తూ పూజ చేయాలని పురోహితులు అంటున్నారు. దుర్గాదేవి శ్రీకృష్ణుడికి సోదరి కావడంతో విష్ణు అవతార తిథులైన అష్టమి, నవమి తిథుల్లోనూ అమ్మవారిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఇంకా అమ్మవారిని అమావాస్య, పౌర్ణమి, మంగళ, శుక్ర, ఆదివారాల్లో పూజించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. 
 
రాహు దోషం తొలగిపోవాలంటే..?
రాహు గ్రహానికి, దుర్గాదేవికి ఓ సంబంధం ఉంది. రాహు గ్రహానికి అధిదేవత దుర్గాదేవి. అందుచేత రాహు కాలంలోనే దుర్గాపూజ జరుగుతోంది. ఆదివారం రాహు కాల పూజ విశిష్టమైనది. రాహువుకు శరీరమంతా విషంతో నిండివుంటుంది. కానీ తోకలో మాత్రం అమృతం ఉంటుంది. అందుచేత ఆదివారం సూర్యుడు అస్తమించే సంధ్యాకాలానికి ముందు వచ్చే రాహుకాలంలో ఆయన తోక అమృతంగా మారివుంటుంది. అంటే ఆదివారం సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటలలోపు దుర్గాదేవిని పూజించినట్లైతే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం.  
 
అనారోగ్య సమస్యలు, ఈతిబాధలు, రుణబాధలు తొలగిపోవాలంటే.. ఆదివారం సాయంత్రం రాహుకాలంలో దుర్గాదేవి కంటూ ప్రత్యేకంగా గల ఆలయంలో ఒక నిమ్మపండును సగంగా కోసి.. నిమ్మరసాన్ని పిండేసి.. నిమ్మపండును ప్రమిదల్లా తిప్పి.. అందులో నెయ్యి పోసి ఐదు వత్తులతో దీపమెలిగించాలి. ఈ దీపాలు అమ్మవారిని చూసేట్లు వెలిగించాలి. ఈ పూజ చేసేటప్పుడు అమ్మవారికి మల్లిపువ్వులు లేదా పసుపు చామంతులను మాత్రమే సమర్పించాలి. 
 
అర్చన చేయాలనుకుంటే అమ్మవారి పేరు మీదే పూజ చేయాలి. దీపం వెలిగించాక అమ్మవారిని మూడుసార్లు ప్రదక్షణ చేసుకుని నమస్కరించుకోవాలి. దుర్గాస్తుతి చేయాలి. దుర్గాపూజ తర్వాత నవగ్రహ ప్రదక్షణలు కూడదు. ఇంటికొచ్చాక పూజగదిలో నెయ్యిదీపమెలిగించి.. ఐదు అగరవత్తులు, కర్పూరంతో పూజ చేయాలి. ఇలా తొమ్మిదివారాల పాటు దుర్గాదేవిని పూజిస్తే.. కుజదోషాలు పటాపంచలవుతాయని పండితులు చెప్తున్నారు.