శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : బుధవారం, 15 ఆగస్టు 2018 (17:14 IST)

రాఖీ పండుగ.. అలా వచ్చింది.. సోదరునికే కాదు.. భర్తకు కూడా రాఖీ కట్టొచ్చా?

శ్రావణ పూర్ణిమ నాడు వచ్చే రాఖీ పండుగకు ఉన్న పవిత్రత ఏమిటంటే? భార్య-భర్తకు, సోదరి-సోదరులకు కట్టే రాఖీ ద్వారా వారు తలపెట్టే కార్యములు విజయవంతమై, సుఖసంపదలు చేకూరుతాయి. ఇంకా రాఖీ కట్టే సోదరీ మణులు, భార్యా

శ్రావణ పూర్ణిమ నాడు వచ్చే రాఖీ పండుగకు ఉన్న పవిత్రత ఏమిటంటే? భార్య-భర్తకు, సోదరి-సోదరులకు కట్టే రాఖీ ద్వారా వారు తలపెట్టే కార్యములు విజయవంతమై, సుఖసంపదలు చేకూరుతాయి. ఇంకా రాఖీ కట్టే సోదరీ మణులు, భార్యామణులు వారి మర్యాదలకు భర్త/సోదరుడు బాసటగా ఉండాలని ఆకాంక్షించే సత్ సంప్రదాయమే ఈ రాఖీ పండుగ. 
 
తమ మర్యాదలకు ఎలాంటి భంగం కలగకుండా చివరి వరకు కాపాడే రక్షకులుగా సోదరులుండాలని ఆకాంక్షిస్తూ రాఖీని కట్టడం సంప్రదాయం. అయితే సోదరులకే గాకుండా.. భర్తకు కూడా భార్య రాఖీ కట్టవచ్చునని పురాణాలు చెప్తున్నాయి. 
 
పూర్వం దేవతలకు - రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారమంతటిని కూడగట్టుకుని 'అమరావతి'లో తలదాచుకుంటాడు. 
 
అట్టి భర్త నిస్సహాయతను గమనించిన ఇంద్రాణి 'శచీదేవి' తగు తరుణోపాయమునకై ఆలోచిస్తూ ఉన్న సమయాన ఆ రాక్షసరాజు చివరకు 'అమరావతి'ని కూడా దిగ్భంధన చేయబోతున్నాడు అని గ్రహించి, భర్త దేవేంద్రునకు 'సమరోత్సాహము' పురికొలిపినది. సరిగా ఆరోజు "శ్రావణ పూర్ణిమ" అగుటచేత 'పార్వతీ పరమేశ్వరులను', లక్ష్మీ నారాయణులను పూజించి ఆ పూజించబడిన "రక్షా" దేవేంద్రుని చేతికి కడుతుంది. 
 
అది గమనించిన దేవతలందరు వారు పూజించిన రక్షలు తెచ్చి ఇంద్రునకు కట్టి ఇంద్రుని విజయయాత్రకు అండగా నిలచి, తిరిగి 'త్రిలోకాధిపత్యాన్ని' పొందారు. ఆనాడు శచీదేవి ప్రారంభించిన 'ఆ రక్షాబంధనోత్సవం' నేడు అది 'రాఖీ' పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి. అలా రాఖీలు కట్టించుకున్న భర్తలు, సోదరులు భార్య లేదా సోదరికి నూతన వస్త్రాలు, చిరుకానుకలు సమర్పించి, అందరూ కలిసి చక్కని విందు సేవిస్తారని పురోహితులు అంటున్నారు. 
 
ఇకపోతే.. శ్రావణ పూర్ణిమ రోజున బ్రాహ్మణులు నూతన జంధ్యాలు ధరిస్తారు. ఈ రోజున బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీతధారణలు చేసి విద్యార్థులకు వేదపఠనం ప్రారంభిస్తారు. 'జంధ్యాల పూర్ణిమ' అని పిలువబడే ఈ పండుగ కాలక్రమమున "రక్షాబంధన్ లేదా రాఖీ" పండుగగా ప్రాచుర్యం పొందింది.