శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Selvi
Last Updated : మంగళవారం, 9 డిశెంబరు 2014 (17:47 IST)

ధనుర్మాసంలో పెళ్లీడుకి వచ్చిన అమ్మాయిలు ఏం చేయాలి?

ధనుర్మాసం వచ్చేస్తోంది. ధనుర్మాసం ఆరంభం కాగానే వైష్ణవ ఆలయాల్లో వైభవం మొదలవుతుంది. ధనుర్మాసంలో పెళ్లీడుకి వచ్చిన అమ్మాయిలు గోదా సమేత రంగనాయకస్వామిని పూజించడం వలన కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 
 
ఈ మాసంలో ఉదయాన్నే స్నానం చేసి .. వాకిట్లో ముగ్గులు పెట్టాలి. ముగ్గుల మధ్య గొబ్బెమ్మల నుంచి వాటిని పూలతో అలంకరించాలి. గడపకి పసుపు కుంకుమలు ... గుమ్మానికి పచ్చని తోరణాలు ఉండేలా చూసుకోవాలి. అనునిత్యం గోదాదేవి సమేత రంగనాథస్వామిని పూజిస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన గోదా సమేత రంగనాయకస్వామి అనుగ్రహంతో మనసుకి నచ్చిన వారితో వివాహం జరుగుతుందని పండితులు అంటున్నారు.  
 
ఎందుకంటే.. రంగనాథస్వామికి మనసిచ్చిన గోదాదేవి ఆ స్వామిపై పాశురాలను రచించింది. ఈ నెలరోజుల పాటు ఆ పాశురాలను ''తిరుప్పావై''గా స్వామివారి సన్నిధిలో గానం చేయడం జరుగుతూ ఉంటుంది. 'ఆండాళ్' పేరుతో గోదాదేవిని భక్తులు కొలుస్తుంటారు. 
 
లక్ష్మీదేవి అంశతో అవతరించినదిగా చెప్పబడుతోన్న గోదాదేవి, మధురభక్తికి నిలువెత్తు నిర్వచనంలా కనిపిస్తూ ఉంటుంది. రంగనాథస్వామిని మనస్పూర్తిగా ప్రేమించిన ఆమె ఆయనని భర్తగా పొందాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం ధనుర్మాసంలో స్వామిని అత్యంత భక్తిశ్రద్ధలతో సేవిస్తుంది.
 
అసమానమైన ప్రేమతో స్వామివారికి పూల మాలికలు అల్లి ఆయన మనసు గెలుచుకుంటుంది. తాను కలలు కన్నట్టుగానే రంగనాథస్వామిని వివాహమాడుతుంది. ఈ కారణంగా స్వామివారి క్షేత్రాల్లో ఆయన సన్నిధానంలో గోదాదేవి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. 
 
భక్తులతో పూజలు అందుకుంటూ ఉంటుంది. రంగనాథస్వామి పట్ల గోదాదేవికి గల ప్రేమ ... భక్తి .. విశ్వాసాలను ఆవిష్కరిస్తూ మరింత విశేషాన్ని సంతరించుకున్నదిగా ధనుర్మాసం కనిపిస్తుంది.