బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Selvi
Last Updated : శనివారం, 17 జనవరి 2015 (15:39 IST)

శ్రీ వేంకటేశ్వర స్వామిని వేడుకుంటే చాలు... అన్నీ..?

శ్రీ వేంకటేశ్వరుడు నిత్యకళ్యాణం.. పచ్చతోరణం అనే మాటను నిజం చేస్తుంటాడు. సౌందర్యమంటే శ్రీనివాసుడిదే, సంపదంటే శ్రీనివాసుడిదే, సూర్యభగవానుడితో సమానమైన తేజస్సు ఆయనదే అన్నట్టుగా ఆ స్వామి కనిపిస్తుంటాడు. గర్భాలయం నిండుగా కళకళలాడుతూ ఆయన దర్శనమిస్తూ వుంటే, కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్లు సైతం ఆ విషయాన్ని మరిచిపోయి అలాగే చూస్తుండిపోతారు.
 
అలాంటి విశిష్టమైన ఆలయాలలో ఒకటి మనకి 'మిర్యాలగూడెం'లో దర్శనమిస్తుంది. నల్గొండ జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రంలో అలమేలుమంగ - పద్మావతీ సమేత వేంకటేశ్వరస్వామి కొలువుదీరి కనిపిస్తుంటాడు.
 
గర్భాలయంలో గల మూలమూర్తి నిలువెత్తు రూపం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. గర్భాలయానికి ఇరువైపులా గల ప్రత్యేక మందిరాలలో అమ్మవార్లు కొలువై పూజలందుకుంటూ వుంటారు. ఆలయ ప్రాంగణంలోనే ఓ వైపున హనుమంతుడు ... నాగేంద్రుడు దర్శనమిస్తూ వుంటారు.  
 
ప్రతి శనివారంతో పాటు విశేషమైన పర్వదినాల్లో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. ఎవరు ఎలాంటి కష్టాల్లో వున్నా ఈ వేంకటేశ్వరుడిని వేడుకుంటే చాలట. అనతికాలంలోనే అవన్నీ తొలగిపోతాయనీ, ఆనందకరమైన జీవితం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.