గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : బుధవారం, 30 నవంబరు 2016 (13:56 IST)

తిరుమల శ్రీవారి తొలిసంపద ఆలమందలే...!

ఇప్పుడు తిరుమల శ్రీవారి సిరిసంపదలతో తులతూగుతోంది. వార్షిక ఆదాయం రూ.2,500 కోట్లు దాటి 3 వేల కోట్ల రూపాయల దిశగా పరుగులు తీస్తోంది. బ్యాంకుల్లో శ్రీవారికి చెందిన 7 టన్నుల బంగారం గుట్టగా పోగయింది. రూ.15 వ

ఇప్పుడు తిరుమల శ్రీవారి సిరిసంపదలతో తులతూగుతోంది. వార్షిక ఆదాయం రూ.2,500 కోట్లు దాటి 3 వేల కోట్ల రూపాయల దిశగా పరుగులు తీస్తోంది. బ్యాంకుల్లో శ్రీవారికి చెందిన 7 టన్నుల బంగారం గుట్టగా పోగయింది. రూ.15 వేల కోట్ల డిపాజట్లు బ్యాంకుల్లో ఉన్నాయి. ఎక్కడెక్కడో భూములు, మిద్దెలు మేడలు శ్రీవారి సొంతం. అయితే ఒకనాడు శ్రీవారి సంపదంతా ఆవు మందలే. ఆ ఆవు మందలే స్వామివారి ఆలయంలో దీపారాధనకు ఆధారమయ్యాయి. శ్రీవారి ఆలయంలో ఒకప్పుడు ఆలయంలో దీపం వెలిగించడానికే ఇబ్బందిపడ్డారు. దీపం వెలిగించడం కోసమే విరాళాలు స్వీకరించారు. ఇలా స్వీకరించిన విరాళాలలో ఆవుల మందలే ప్రధానంగా ఉండేవి. ఆలయంలో ఒక నేతిదీపం వెలిగించాలంటే 32 ఆవులు, ఒక ఆబోతు స్వామివారికి కట్నంగా స్వీకరించేవారట. ధనవంతులైతే 40 కొలంజుల బంగారం ఇచ్చేవారట. ఇది ఒక పద్ధతిగా  ఆనాడు నిర్దేశించుకున్నారు.
 
శ్రీవారి ఆలయంలో క్రీ.శ.830లో అప్పటి రాజులు నందవిళక్కు అంటే వెలుగుతున్న దీపం అనే పేరుతో నిత్యం నేతిదీపం వెలిగించే పద్థతికి శ్రీకారం చుట్టారట. శాసనాల్లో చాలా చోట్ల వెలుగుతున్న దీపం ప్రస్తావన ఉంది. దీపాలను వెలిగించడానికి ఎవరెవరు విరాళాలు ఇచ్చిందీ శాసనాల్లో రాశారు. దీపాలను వెలిగించడానికి విరాళంగా వచ్చిన ఆవులను పోషించడానికి అవసరమైన గడ్డి పెంపకం కోసం భూములు విరాళంగా ఇచ్చిన రాజులున్నారు. 
 
బంగారాన్ని శ్రీవారి భాడాగారానికి జమచేసిన విధమూ ఆనాడు అమల్లో ఉంది. క్రీ.శ.905 నుంచి క్రీ.శ.953 దాకా ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి పరాంతక చోళుడైన పరాకేశసరి.. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో రెండు నేతి దీపాలు వెలిగించడం కోసం ఒక్కో దీపానికి 40 కొలంజుల బంగారం దానం చేశారు. తెలుగు పల్లవ రాజులలో అత్యంత ముఖ్యుడైన విజయగండ గోపాలుని పట్టపురాణి దేవరసియార్‌ తిరుమల శ్రీవారి సన్నిధిలో మూడు దీపాలు వెలిగించడానికి 32 ఆవులు, ఒక ఆబోతు, బంగారం దానం చేశారు. యాదవ రాజులలో అత్యంత పరాక్రమవంతునిగా పేరుగాంచిన వీరనరసింగదేవ యాదవ రాయలు గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యం దీపారాధన కసం 32 గోవులను, ఒక ఎద్దును దానం చేశారు. 
 
అలాగే తిరుమల ఆలయానికీ 32 ఆవులు, ఒక ఆబోతు దానం చేశారు. శాసనాల్లో పలు చోట్ల శ్రీవారికి గోదానం చేసిన ఉదంతాలు కనిపిస్తాయి. దీపారాధనకు గోవులే ఆధారంగా కనిపిస్తాయి. గోవులను పోషించడం, వాటి ద్వారా వచ్చే పాల నుంచి వెన్నెను దాని నుంచి నెయ్యిని సేకరించి దాంతో దీపాలు వెలిగించడమనేది ఒక పద్దతిగా సాగింది. అందుకే శ్రీవారి తొలి సంపద ఆలమందలే అయ్యాయి. ఈ లెక్కన అప్పట్లో శ్రీవారికి ఎన్ని వేల ఆవులు ఆస్తిగా ఉండేవో అనిపిస్తుంది. ఇప్పటికీ స్వామివారికి ఆవులను కానుకగా వచ్చే సాంప్రదాయం కొనసాగుతోంది. తిరుమల, తిరుపతిలోని తితిదే గోశాలలో ఉన్నవి అలా వచ్చిన ఆవులే.