శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 జూన్ 2016 (14:49 IST)

ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని ఎత్తుకెళ్లిన దొంగ.. అందుకే ఆయన్ని పూజించం.. ద్రోణగిరి ప్రజలు!!

శ్రీరామ భక్తుడు.. రామునికి విధేయుడు అయిన ఆంజనేయస్వామిని కొలిచిన వారికి దుఃఖాలంటూ వుండవు. అయితే ఆ ఊరి ప్రజలు మాత్రం ఆంజనేయస్వామి అంటేనే ఆమడదూరం పరుగెడుతున్నారు. అంతేకాదు.. ఆ పేరు వినిపిస్తేనే ఇంతెత్తున

శ్రీరామ భక్తుడు.. రామునికి విధేయుడు అయిన ఆంజనేయస్వామిని కొలిచిన వారికి దుఃఖాలంటూ వుండవు. అయితే ఆ ఊరి ప్రజలు మాత్రం ఆంజనేయస్వామి అంటేనే ఆమడదూరం పరుగెడుతున్నారు. అంతేకాదు.. ఆ పేరు వినిపిస్తేనే ఇంతెత్తున లేస్తారు. పొరపాటున ఎవరైనా ఆంజనేయ స్వామిని కొలిస్తే.. వాళ్లను ఊరి నుంచి బహిష్కరిస్తారు. వారు హిందువులే కానీ హనుమ అంటేనే వారికి కోపం కట్టలు తెంచుకుని వస్తుంది. ఇంతకీ వాయుపుత్రుడంటే ఆ ఊరి జనానికి ఎందుకంత కోపమో తెలుసుకుందాం.. 
 
ఆంజనేయ స్వామి అంటేనే అస్సలు గిట్టని హిందువులు మనదేశంలో ఉండరని అందరూ అనుకుంటారు. అయితే వాయుపుత్రుడు పేరెత్తినే కోపంతో ఊగిపోయే గ్రామం కూడా ఒకటుంది. ఆ గ్రామం పేరు ద్రోణగిరి. ఉత్తరాఖండ్‌లోని ఓ చిన్న ఊరు. భూటియా తెగకు చెందిన ప్రజలు నివసించే ఈ ప్రాంతంలో హిందూ దేవుళ్లందరినీ కొలిచే ఆచారం ఉంది. అయితే ఆంజనేయ స్వామి అంటేనే వారికి గిట్టదు. 
 
ద్రోణగిరి వాసులు కలలో కూడా ఆంజనేయుడి పేరు పలకరు. ఎందుకంటే ద్రోణగిరి ప్రజల దృష్టిలో ఆంజనేయస్వామి ఓ దొంగ. ఈ విషయం వినటానికి విడ్డూరంగా ఉన్నా ఇదే నిజమంటారు. అదేంమంటే అందుకు ఓ కథ కూడా చెప్తారు. రామ-రావణ యుద్ధంలో ఇంద్రజిత్తు బాణం తగిలి లక్ష్మణుడు మూర్ఛపోతాడు. అతన్ని కాపాడేందుకు ఆంజనేయుడు హిమాలయాల నుంచి సంజీవని పర్వతం తీసుకువస్తాడు. ఇందంతా పౌరానిక గాథ.
 
తమ గ్రామం పక్కనే సంజీవని కొండ ఉండేదని దాన్ని ద్రోణగిరి ప్రజలు పూజించేవారని.. దాన్నే హనుమంతుడు దొంగలించి తీసుకువెళ్లాడని చెప్తున్నారు. అలాంటి వారిని ఎందుకు పూజించాలని వారు ఎదురు ప్రశ్న వేస్తున్నారు. తమ ఊరిలో ఎవరైనా హనుమంతుడి పేరు ఎత్తితే గ్రామ బహిష్కరణ తప్పదంటున్నారు. హిందూ దేవుళ్లను పూజిస్తాం గానీ ఆంజనేయుడికి మాత్రం అందులో స్థానం ఉండదని ఆ ఊరి ప్రజలు వివరణ ఇస్తున్నారు. అదన్నమాట ఆంజనేయునిపై ద్రోణగిరి ప్రజల అభిప్రాయం..!