శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : బుధవారం, 11 జనవరి 2017 (11:41 IST)

తితిదే సిబ్బంది నిర్లక్ష్యమే పోటు తయారీ కేంద్రంలో ప్రమాదానికి కారణం..!

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడు. స్వామివారు కొలువై ఉన్న తిరుమల గిరులకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. ప్రతిరోజు వేలాదిమంది భక్తులు వస్తూ పోతుంటారు.

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడు. స్వామివారు కొలువై ఉన్న తిరుమల గిరులకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. ప్రతిరోజు వేలాదిమంది భక్తులు వస్తూ పోతుంటారు. ఎప్పుడూ అప్రమత్తంగా వ్యవహరించే సెక్యూరిటీ సిబ్బంది. అయితే ఏదో ఒక విధంగా తిరుమలలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటూనే ఉన్నాయి. 
 
కోట్లాదిమంది హిందువుల ఆరాధ్యదైవమైన తిరుమల వెంకన్న స్వామికి అత్యంత ఇష్టమైంది లడ్డూలు. ఆ లడ్డూ ప్రసాదం కోసం భక్తులు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తీసుకెళ్లతారన్నది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి లడ్డూలు తయారుచేసే పోటు సిబ్బంది ఎలా ఉండాలి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో భక్తిభావంతో, అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే అందుకు పూర్తి విరుద్ధం పోటు సిబ్బంది. ఎప్పుడూ విధుల్లో నిర్లక్ష్యంగా ఉండడం వీరికి అలవాటు. అందుకే బూందిపోటులో ఏదో ఒక విధంగా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. 
 
2013సంవత్సరంలో శ్రీవారి ఆలయంలోని పోటులో మంటలు చెలరేగాయి. విద్యుత్‌ షార్ట్ సర్య్కూట్‌ కారణంగా ప్రమాదం జరిగింది. ఇదే సంవత్సరాంతంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నప్రసాద సముదాయంలో భారీ ప్రమాదం జరిగింది. గోనె సంచిలో కుప్పతో మంటలు పుట్టాయి. మంటలతో భవనం కొంత భవనం భాగం దెబ్బతినడంతో పాటు మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.
 
అంతేకాదు శ్రీవారి ఆలయం, విశ్రాంతి సముదాయాల్లో విద్యుత్‌ షార్ట్ షర్య్కూట్‌తో ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. గత యేడాది జూన్‌ 10వతేదీన వేకువజామున బూందీ పోటులో చోటుచేసుకున్న ప్రమాదంలోను నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. కాగిన నెయ్యి ఆవిరి రూపంలో వెళ్ళి గోడలకు, పైకప్పులకు అతుక్కుంది. మంటలతో గోడలకు ఉన్న నెయ్యితో మరింత తీవ్రరూపం దాల్చింది. మంటలు లేచినప్పటికీ గోడలకు, పైకప్పునకు నెయ్యిలేకుంటే పెద్దగా మంటలు వచ్చేవి కాదు. ఈ నేపథ్యంలో కొన్ని చర్యలు తీసుకున్నా మార్పు రాలేదని తాజా ఘటనతో తేటతెల్లమైంది. నిత్యం భక్తజన సంచారం ఉన్న ప్రాంతాల్లో జరిగే ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం లేదు. అన్ని ప్రమాదాల వెనుక మానవ తప్పిదాలే ఉన్నట్లు తేలింది.
 
గతంలో అగ్నిప్రమాదాలపై ఒక అధ్యయన కమిటీని వేస్తే అది ఏ మాత్రం పనిచెయ్యలేదు. తిరుమలలోని శ్రీవారి ఆలయ పోటు, వెలుపల ఉన్న బూందీపోటు, నిత్య అన్న ప్రసాద సముదాయం, విశ్రాంతి సముదాయాలపై అధ్యయనం పూర్తి స్థాయిలో చేపట్టలేదు. భవిష్యత్తులో అగ్నిప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నిపుణుల నుంచి నివేదిక తీసుకుని వెంటనే ఆచరణలో పెట్టాలని తితిదే సంకల్పించినా అమలు కాలేదు. ప్రమాదాలు జరుగకుండా, జరిగే పక్షంలో వెంటనే నివారణకు పరికరాలు, ఇతరత్రా ఆధునిక యంత్ర సామగ్రిని సమకూర్చుకోవాల్సి ఉంది. అయితే తాజాగా ప్రస్తుతం మరో ప్రమాదం జరిగింది. బూందీ పోటులోని ఒక నూనె బాండీలో నీళ్లు పడటంతో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఫైరింజన్లు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పాయి. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
 
కానీ అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న భక్తులు మాత్రం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదాలు జరుగకుండా తితిదే ఉన్నతాధికారులు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుకుంటున్నారు. ప్రమాదాలకు కారణమవుతున్న పోటు కార్మికులకు శిక్షణ ఇచ్చి భవిష్యత్తులో పునరావృతంకాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.