శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 16 జులై 2014 (18:42 IST)

పుష్కరాల తేదీపై తలనొప్పి: జూలై 14వ తేదీని ఖరారు చేస్తారా?

పన్నెండేళ్లకు ఒక్కసారి వచ్చే గోదావరి పుష్కరాలను వచ్చే ఏడాది ఏ రోజున నిర్వహించాలనే విషయమై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పంచాంగ కర్తలు అంతా తలో ఒక తేదీని సూచించడంతో పుష్కరాలు ఎప్పటి నుంచి నిర్వహించుకోవాలనే విషయంలో అధికారులు తలపట్టుకుంటున్నారు. 
 
కొందరు పండితులు వచ్చే ఏడాది జూన్ 28వ తేదీ ఉదయం 8 గంటల 27 నిమిషాల నుండి పుష్కరాలు ప్రారంభించి పన్నెండు  రోజుల పాటు జరుపుకోవాలని సూచిస్తుండగా, మరికొందరు జూలై 7తేదీ నుండి 19వతేదీ అని, ఇంకొందరు జూలై 14వ తేదీ అని  చెప్పుతున్నారు. వీరిలో ఎవరి తేదీ ఖచ్చితమో తెలియక పుష్కరాలు ఎప్పుడు నిర్వహించాలో తెలియక తలపట్టుకుంటున్నారు. 
 
ప్రముఖ జ్యోతిష్క పండితులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత మధుర కృష్ణమూర్తి శాస్త్రి పుష్కరాలను జూన్ 28వ తేదీ నుండే  ప్రారంభించాలని చెప్పుతుండగా, శ్రీశైలం ఆలయ ఆస్థాన సిద్ధాంతి బుట్టే దైవజ్ఞ వీరభద్ర సిద్దాంతి జూలై 7వ తేదీ నుండి  ప్రారంభించాలని అంటున్నారు. పిడపర్తి వారి పంచాంగం, నేమాని పంచంగాలతోపాటు ఇతర పంచాంగ కర్తలు ఎక్కువ మంది జూలై  14వ తేదీన ప్రారంభించాలని సూచిస్తున్నారు.  
 
ప్రముఖ పంచాంగకర్తలతో ఒక సమావేశం నిర్వహించి పుష్కరాలు ఏ తేదీ నిర్వహించాలో త్వరలో ప్రకటిస్తామని అంటున్నారు.  ఇంతవరకు సేకరించిన సమాచారం మేరకు ఎక్కువ మంది పంచాంగకర్తలు జూలై 14వ తేదీ ప్రారంభించాలని సూచిస్తున్నందున  అధికారులు ఆ తేదీనే ప్రభుత్వపరంగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
 
ఇకపోతే.. తేదీ ఖరారు కాకుండా పుష్కరాల పనులను ఎప్పటి నుంచి ప్రారంభించాలో తెలియక అధికారులు తికమకపడుతున్నారు. అలాగే పుష్కరాలు ఎప్పుడు నిర్వహించాలనే విషయమై స్పష్టత తీసుకొచ్చేందుకు దేవాదాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.