గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 31 జులై 2017 (11:53 IST)

రాముని ఆజ్ఞ.. కలియుగ అంతం వరకు ఆంజనేయుడు చిరాయువై వుంటాడట..

రామావతారం పరిసమాప్తి కాబోతోంది. కుశలవులకు పట్టాభిషేకం చేసిన మరునాడు రాముడు దివ్యలోకానికి చేరుకునే సమయం వచ్చింది. రాముడు వెళ్ళిపోతాడని తెలుసుకుని వానరులు, భల్లూకాలు, రాక్షసులు తండోపతండాలుగా అయోధ్యకు వచ

రామావతారం పరిసమాప్తి కాబోతోంది. కుశలవులకు పట్టాభిషేకం చేసిన మరునాడు రాముడు దివ్యలోకానికి చేరుకునే సమయం వచ్చింది. రాముడు వెళ్ళిపోతాడని తెలుసుకుని వానరులు, భల్లూకాలు, రాక్షసులు తండోపతండాలుగా అయోధ్యకు వచ్చారు. అంగదుడు, విభీషణులు తమ రాజ్యాలను ఇతరులకు అప్పగించి రామునితోనే లోకాన్ని వదిలి వెళ్లాలనుకుంటారు.

అలా వచ్చిన వారిని నచ్చజెప్పిన రాముడు.. విభీషణుడితో సూర్యచంద్రులు ఉన్నంతకాలం.. రామకథ ఈ లోకంలో ప్రజలు చెప్పుకొన్నంత కాలం నువ్వు ధర్మబద్ధమైన పాలన గురించి పొగిడేలా చక్కని రాజ్యపాలన చేయాలి అన్నాడు. ఇది స్నేహితునిగా తన ఆజ్ఞ అంటాడు.
 
అంతేగాకుండా తమ ఇక్ష్వాకువంశ కులనాధుడు జగన్నాధుడు. ఆయనను సదా సేవించమని విభీషణుడితో చెప్తాడు. ఆ తర్వాత ఆంజనేయుడిని పిలిచి నాయనా! నీవు, మైందుడు, ద్వివిదుడు.. మీ ముగ్గురు కలికాలం అంతమయ్యేదాకా చిరాయువులై వుండాలని ఆశీర్వదిస్తాడు. మిగిలిన వానర భల్లూక వీరులందరినీ తనతో తీసుకెళ్లేందుకు రాముడు అనుజ్ఞ ఇచ్చాడు. 
 
మరునాడు.. రాముడు సన్నని వస్త్రాలు ధరించి, చేతివేళ్ల మధ్య దర్భలు పట్టుకుని, మంత్రోఛ్ఛారణ చేస్తూ నడిచాడు. అప్పుడు ధనుర్భాణాలు పురుష రూపంలో ఆయన్ని అనుసరించాయి. వేదాలు, బ్రహ్మర్షులు, విప్రులు, భరత శత్రుఘ్నులు, అంతఃపుర ప్రజలు, వానరులు, రాక్షసులు పురుషోత్తముని వెంట నడిచారు. అయోధ్యలో ఉన్న పశుపక్ష్యాదులు కూడా రాముని వెంట నడిచాయి.
 
ఇలా రాముడు సరయూ నది వద్దకు చేరుకున్నాడు. అప్పటికే దేవతలతో ముని బృందాలతో బ్రహ్మదేవుడు వేంచేసి ఎదురుచూస్తున్నాడు. ఆ సమయంలో పూలవాన కురిసింది. పరిమళాలలతో గాలి చల్లగా వీస్తోంది. బ్రహ్మదేవుని వేడుకోలు మేరకు రాముడు దివ్య శరీరాన్ని ధరించి.. వైష్ణవ రూపం స్వీకరించాడు. ఆ సమయంలో భరతశత్రుఘ్నులు కూడా దివ్యరూపం ధరించారు.

ఇక తనను నమ్ముకుని తన వెంట వచ్చిన వారికి పుణ్యలోకం ప్రసాదించాల్సిందిగా రాముని ఆజ్ఞ మేరకు బ్రహ్మదేవుడు బ్రహ్మర్షులు, విప్రులు, భరత శత్రుఘ్నులు, అంతఃపుర ప్రజలు, వానరులు, రాక్షసులు, పశుపక్ష్యాదులు పుణ్యతీర్థంలో మునిగేలా చేసి పుణ్యలోకానికి పంపిస్తాడు. సుగ్రీవుడు సూర్యుడిలో లీనమైపోతాడు.