బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Modified: శనివారం, 15 అక్టోబరు 2016 (18:05 IST)

శ్రీవారి హుండీ (కొప్పెర) గురించి తెలుసుకుందాం...

తిరుమల శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలికి ఉత్తర పార్శ్వంలో గల నాలుగు స్తంభాల నడుమ ఏర్పాటు చెయ్యబడింది. శ్రీ స్వామివారిని దర్శనం చేసుకొని విమాన ప్రదక్షిణం చేసి వచ్చిన భక్తులు తమతమ మొక్కుబళ్ళను, కానుకలను, నిలువు దోపిళ్ళను ఈ హుండీలో సమర్పించుకుంటారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలికి ఉత్తర పార్శ్వంలో గల నాలుగు స్తంభాల నడుమ ఏర్పాటు చెయ్యబడింది. శ్రీ స్వామివారిని దర్శనం చేసుకొని విమాన ప్రదక్షిణం చేసి వచ్చిన భక్తులు తమతమ మొక్కుబళ్ళను, కానుకలను, నిలువు దోపిళ్ళను ఈ హుండీలో సమర్పించుకుంటారు.
 
బంగారు నగలు, వెండి పాత్రలు, ముడుపులు, నాణేలు, నోట్లు, వస్త్రాలు, కర్పూరం, బియ్యం ఇలా ఎన్నో రకాలైన వస్తువులను భక్తులు స్వామివారికి కానుకలుగా ఈ హుండీ ద్వారా సమర్పిస్తారు. నిటారుగా పెద్ద సంచీ ఆకృతితో ఏర్పాటు చేయబడిన తెల్లని కాన్వాసు గుడ్డలో పెద్ద రాగి గంగాళాన్ని దించి పైగుడ్డను రోటి వలె తాళ్ళతో కట్టి వేలాడదీస్తారు. ఈ కాన్వాసు గుడ్డపై శ్రీవారి శంఖుచక్రాలు తిరునామాలు చిత్రింపబడి ఉన్నాయి. భక్తులు వేసే కానుకలు భద్రంగా సరాసరి గంగాళంతో పడేటట్లుగా ఏర్పాటు చేయబడిన ఈ బుర్కాగంగాళాన్ని కొప్పెర అని కూడా అంటారు. ఈ హుండీ గుడ్డపై గల తాళ్లపైన దేవస్థానం వారి సీళ్ళు ఏడు, అలాగే జియ్యంగార్ల సీళ్ళు ఆరు లక్కతో వేస్తారు. ఈ హుండీని ఏర్పాటు చేసినప్పుడు పరకామణి నిమిత్తం విప్పేటప్పుడు అధికారులు ఈ సీళ్ళు సరిగా ఉన్నది లేనిదీ తనిఖీ చేస్తారు.
 
ఇందుకు సాక్ష్యంగా ఇద్దరు యాత్రికులు కూడా ఉంటారు. హుండీని రోజుకు రెండుసార్లు అనగా మధ్యాహ్నం రెండవ నైవేధ్య కాలంలో 12 గంటల సమయంలోను, మళ్ళీ రాత్రి ఏకాంతసేవా సమయంలోను విప్పదీస్తారు. మరీ యాత్రిక జనసమ్మర్థం విపరీతంగా ఉంటూ కానుకలు ఎక్కువైన సమయంలో హుండీని రోజుకు మూడునాలుగు సార్లు కూడా తీయడం జరుగుతుంది. 
 
హుండీని ఏర్పాటు చేసిన ఈ స్థలంలో జగద్గురువులన శ్రీ మచ్చంకర భవత్పాదుల వారు శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారని అందువల్లే అపరిమితమైన సంపద అసంఖ్యాకంగా ద్రవ్యారాశి ఆకర్షింపబడి ఈ  హుండీ లోనికి చేరుతున్నదని పరంపరగా వినవస్తున్న గాథ అని పెద్దల మాట. ఇది సత్యమే. ఈ హుండీ క్రమంగా క్రిందుగా శ్రీ చక్రమున్నట్లుగా ప్రత్యక్షంగా దర్శించిన తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు శ్రీ రామనాథ ఘనాపాటి ఈ రచయితతో చెప్పారు. సుమారు 70 యేళ్ళ క్రితం తాను వేదవిద్యార్థిగా ఉన్నప్పుడు ఆలయ అధికారులు నేలను ఎత్తు పెంచడానికి హుండీ ఉన్న స్థలాన్ని త్రవ్వి చూడగా శ్రీ చక్ర యంత్రం స్పష్టంగా గోచరించిందన్నారు.