శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Modified: శనివారం, 18 జూన్ 2016 (13:07 IST)

తిరుమలేశుని అమూల్య ఆభరణములు... వెలకట్టతరమా...?

శ్రీ వేంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు. అందుకే ఆయనకు భక్తులు ఎన్నెన్నో ఆభరణములను సమర్నించి తమ భక్తిని చాటుకున్నారు. రాజులేకాదు సామాన్యులూ ఎన్నో కానుకలను ఆయనకు అర్పించారు. వాటిని ప్రతినిత్యం స్వామివారికి అర్చకులు అలంకరిస్తారు. దివ్యమంగళ రూపంతో స్వామివ

శ్రీ వేంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు. అందుకే ఆయనకు భక్తులు ఎన్నెన్నో ఆభరణములను సమర్నించి తమ భక్తిని చాటుకున్నారు. రాజులేకాదు సామాన్యులూ ఎన్నో కానుకలను ఆయనకు అర్పించారు. వాటిని ప్రతినిత్యం స్వామివారికి అర్చకులు అలంకరిస్తారు. దివ్యమంగళ రూపంతో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఇక ప్రత్యేక రోజులలో స్వామివారి అలంకరణ నయనానందకరంగా ఉంటుంది. 
 
స్వామివారికి అలంకరించే నగల వివరాలను పరిశీలిస్తే... కిరీటము, చక్రశంఖములు, కర్ణపత్రములు, భుజకీర్తులు, నాగాభరణములు, కడియములు, కటిహస్తము, వైకుంఠ హస్తము, సూర్యకఠారి, సహస్రనామ హారము, అష్టోత్తరశత నామ హారము, చతుర్భుజ లక్ష్మీ హారము, తులసీపత్ర హారము, యజ్ఱోపవీతములు, కంఠాభరణములు, సువర్ణ పాదములు, సువర్ణ పద్మపీఠము తదితర ఆభరణములను ప్రతినిత్యం స్వామివారికి అలంకరిస్తారు. అభిషేకానంతరం అలంకార సమర్పణము ఉంటుంది. ఆ తరువాత ఆభరణములను సమర్పిస్తారు. ఆ అలంకణను చూసి తరించాల్సందే. అందుకే స్వామివారి దర్శన భాగ్యాన్ని భక్తులు పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. 
 
విశేషదినంలో స్వామివారికి ప్రత్యేక ఆభరణాలను అలంకరిస్తారు. రత్నకిరీటం, మేరు పచ్చ, రత్నమయ శంఖుచక్రములు, రత్నమయ కర్ణపత్రములు, రత్నమయ వైకుంఠ హస్తం, కఠిహస్తం, మకర కంఠి, సువర్ణ పీతాంబరములను స్వామివారికి అలంకరిస్తారు. కొన్ని రోజుల్లో ప్రత్యేకంగా తయారుచేసి ఉంచిన సువర్ణ ఆభరణములు రత్నాభరణములు, రత్న హారములు నగలను స్వామివారికి సమర్పిస్తారు. అమూల్యమగు వస్త్రములు, ఆభరణముల వల్ల తిరుమలేశుడు అతి రమణీయంగా భక్తులకు దర్శనమిస్తారు. ఆభరణాల అలంకరణ పూర్తయ్యాకనే అంతర్ ద్వారం తలుపులు తీసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. 
 
స్వామివారికి ఉన్న ఆభరణాలలో కొన్నింటికి ఇప్పటికీ తితిదే వెలకట్టలేకపోతోంది. కోట్ల రూపాయలు విలువ చేసే ఆభరణాలు ఇప్పటికీ స్వామివారికి అలాగే ఉన్నాయి. ఎంతో భద్రంగా వీటిని తితిదే కాపాడుతూ వస్తోంది. ఆభరణాల విషయం అటుంచితే సాక్షాత్తు మూలవిరాట్‌కు పుష్పాలతోనే అలంకరణ చేస్తారు. అది కూడా ఒక్క గురువారం మాత్రమే. ఈ దర్శనాన్ని నిజరూప దర్శనం అంటారు. ప్రతి గురువారం స్వామివారికి ఎలాంటి ఆభరణాలు లేకుండా కేవలం పువ్వులతోనే ఆయన్ను అందంగా అలంకరిస్తారు. స్వామి వారి మూలవిరాట్‌ను ఆ సమయంలో చూస్తే ఎంతో మంచిదని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే స్వామివారు మూలవిరాట్‌ నిజ స్వరూపం వీక్షించడంతో జన్మ ధన్యమవుతుందని విశ్వాసం.