గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (16:13 IST)

తిరుమల శ్రీనివాసుడు పూజించిన దేవుడు ఎవరు?

వేదాలే శిలలై వెలసిన కొండ తిరుమలగిరి. భక్తకోటి ముక్తకంఠంతో ఎలుగెత్తిచాటే కొండ. ఎన్నో కష్టనష్టాలకోర్చి, గంటలు, రోజుల తరబడి క్యూలైన్లలో ఉండి క్షణకాలం పాటు తిరుమలేశుని దర్శనంతో భక్తులంతా పులకించిపోతారు. అ

వేదాలే శిలలై వెలసిన కొండ తిరుమలగిరి. భక్తకోటి ముక్తకంఠంతో ఎలుగెత్తిచాటే కొండ. ఎన్నో కష్టనష్టాలకోర్చి, గంటలు, రోజుల తరబడి క్యూలైన్లలో ఉండి క్షణకాలం పాటు తిరుమలేశుని దర్శనంతో భక్తులంతా పులకించిపోతారు. అలాంటి తిరుమలేశుడు కోట్లాది మంది భక్తుల కన్నుల పంట. 
 
సాధారణంగా ఏ కుటుంబానికైనా ఓ కులదైవముంటాడు. తమ ఇంట జరిగే శుభకార్యంలోనైనా ఆ స్వామిని పూజించడం ఆనవాయితీ. ముఖ్యంగా.. వివాహ సమయంలో తమ ఇష్టదైవానికి నమస్కరించి మిగిలిన ఘట్టం పూర్తి చేస్తారు. 
 
మరి తిరుమలేశుడు పద్మావతిదేవిని వివాహం చేసుకునే సమయంలో పూజించిన భగవత్ స్వరూపం ఎవరో తెలుసా? సాక్షాత్ అహోబిలం నృసింహుడే. ఇప్పటికీ దిగువ అహోబిలంలో శ్రీనివాసుని కళ్యాణాన్ని కన్నులపండుగగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ స్వామి పూజ తర్వాతే శ్రీనివాసుడు పద్మావతి దేవిని పరిణయమాడినట్టు పురాణాలు చెపుతున్నాయి. 
 
తిరుమల వెళ్లినపుడు గమనిస్తే తిరుమలేశుని హుండీకి ఎదురుగా నృసింహ స్వామి ఆలయం కనిపిస్తుంది. అదేవిధంగా తిరుమల నడకదారిలోనూ అనేక నృసింహ ఆలయాలు మనకు కనిపిస్తాయి. ఇక ఉత్తర మాఢ వీధుల్లో అహోబిల మఠాన్ని మనం గమనించవచ్చు. ఇలా తిరుమలకు, అహోబిలానికి మధ్య ఆధ్యాత్మిక వారధి కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే తిరుమల నిజానికి వరాహక్షేత్రం. వరాహస్వామి, తిరుమలేశునికి చోటు ఇచ్చారని చెప్పొచ్చు. 
 
రామావతారంలో సాక్షాత్ శ్రీరాముడే రామేశ్వర లింగాన్ని ప్రతిష్టించాడు. అదేవిధంగా తిరుమలేశుడు సాక్షాత్ విష్ణు స్వరూపమే అయినప్పటికీ, సంప్రదాయాలను గౌరవిస్తూ మరో విష్ణుస్వరూపమైన నృసింహస్వామిని పూజించాడని చెప్పడంలో ఏ విధమైన సందేహం అవసరం లేదు.