శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2016 (11:40 IST)

తిరుమల శ్రీవారు తనకు అత్యంత ఇష్టమైన భక్తులతో మాట్లాడుతాడట.. నిజమేనా?

కలియుగ వైకుంఠుని లీలలు అన్నీఇన్నీ కావు. పురాణాల ప్రకారం ఆయనకు ఎంతో ఇష్టమైన భక్తులతో మాట్లాడేవాడట. అంతేకాదు తనకు ఇష్టమైన వంటకాలను వారి వద్ద చేయించి మరీ తెప్పించుకుని తినేవారట. ఇది నిజమనే పురాణాలు చెబుత

కలియుగ వైకుంఠుని లీలలు అన్నీఇన్నీ కావు. పురాణాల ప్రకారం ఆయనకు ఎంతో ఇష్టమైన భక్తులతో మాట్లాడేవాడట. అంతేకాదు తనకు ఇష్టమైన వంటకాలను వారి వద్ద చేయించి మరీ తెప్పించుకుని తినేవారట. ఇది నిజమనే పురాణాలు చెబుతున్నాయి. ఎప్పుడు స్వామివారి మాట్లాడారు? ఆయనకు అత్యంత ఇష్టమైన భక్తుడు ఎవరో తెలుసుకుందాం.
 
ఇదివరకు తిరుమలలో తొండమాన్‌ చక్రవర్తి స్వామివారికి రోజూ బంగారు తులసి దళాలు సమర్పించేవాడట. అప్పట్లో స్వామివారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారట. ఈ తొండమాన్‌ చక్రవర్తి రోజూ స్వామివారి దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉండేవాడట. స్వామి నేను మీకు రోజూ బంగారు తులసీదళాలతో పూజ చేస్తున్నారు. పైగా నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు? స్వామి అన్నాడట. 
 
అప్పుడు స్వామి అనుకున్నాడట. తొండమానుడికి ఒక పాఠం చెప్పాలని, నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గరలోనే భీముడు అని ఒక కుమ్మరివాడు ఉంటాడు. వాడిని వెళ్ళి చూడు అన్నారట. మరుసటిరోజు వెళదాం అని అనుకుని, స్వామివారి పాదాల కింద ఉన్న తులసి దళాలని శుభ్రం చేస్తున్నాడట తొండమాన్‌. అప్పుడు తను చేయించిన బంగారు తులసి దళాల కింద మట్టి, తులసిదళాలు కనిపించాయట. స్వామివారు అప్పుడు చెప్పారట. ఈ మట్టిదళాలు ఆ భీముడే సమర్పించాడని. అప్పుడు మనస్సులో అనుకున్నాడట.
 
మట్టి తులసీ దళాలు స్వామివారికి నచ్చాయా? అనుకున్న తొండమాన్‌ అతను ఎవరో తెలుసుకోవాలనుకుని బయలుదేరాడట. ఆ రోజు చాలా ఎండగా ఉంది. అప్పటికే నడిచి, నడిచి భీముడి ఇంటి దగ్గరలో స్పృహ తప్పి పడిపోయాడట. అప్పుడు ఆ భీముడే తొండమాన్‌ చక్రవర్తి లేవదీసి తన ఇంటికి తీసుకువెళ్ళాడట. తొండమాన్‌ చక్రవర్తి అప్పుడు అడిగాడట. నువ్వు ఏమి చేస్తూ ఉంటావు. వేంకటేశ్వరస్వామివారికి నువ్వంటే చాలా ఇష్టం అని. భీముడు అన్నాడట. నేనేం చేశాను స్వామికి.. కుండ చేసే ముందు ఈశ్వరా నన్ను అనుగ్రహించావు. కుండలు చేసుకునే శక్తిని ఇచ్చావు. ఆపి అమ్మితే నాలుగు రూపాయలు వచ్చేట్టు చేశావు. వాటి వల్ల నా సంసారం సాగుతోంది. నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసిదళం చేసి నీ పాదాల ముందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి మూర్తికి సమర్పించేవాడట. ఏ పని మొదలుపెట్టినా గోవిందా నేను చేయడమేమిటి. నీవే నాతో చేయించుకుంటున్నావు అనేవాడట.
 
అప్పుడు తొండమాన్‌ చక్రవర్తి అనుకున్నారట. ఇతనేమో అంతా స్వామివారే చేయిస్తున్నారు అని అనుకుంటున్నాడు. నేనేమో నేను చేస్తున్నాను అని సమర్పిస్తున్నాను. ఇదే మనమందరం చేసే పెద్ద తప్పిందం. భీముడు అన్నం తినే ముందు మట్టితో చిన్న మూకుడు చేసి అందులో అన్నం ముద్దపెట్టి స్వామివారికి సమర్పించి తనూ తినేవాడట.
 
స్వామివారు భీముడి భక్తికి పొంగిపోయి శ్రీదేవి, భూదేవి సహితుడే దివ్య విమానంలోంచి దిగి భీముడి పాక ముందు ప్రత్యక్షమయ్యారట. వెంటనే స్వామివారు భీముడిని కౌగిలించుకుని భీముడి తన మీద చూపించే భక్తికి పొంగిపోయి తన ఒంటిమీద ఉన్న ఆభరణాలన్నీ భీముడి మెడలో వేశారట. అలాగే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు వారి ఆభరణాలన్నీ భీముడి భార్యకి తొడిగారట. స్వామివారు గరుత్మంతుడిని పిలిచి ఈ జీవుడిని శరీరంగా వైకుంఠానికి తీసుకెళ్ళమమని ఆదేశించారట. ఇప్పటికే స్వామివారి ఆనంద నిలయంలో మొదటి గడపదాటి పెట్టే నైవేథ్యం కుండతో చేసిన పెరుగు అన్నం. ప్రతి రోజూ ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేథ్యం పెడతారట. అదొక్కటే తింటారు స్వామివారు. దీన్ని ఉదాహరణ చెప్పే పురాణాలు ఒకటే చెబుతున్నాయి. ఎక్కడ భక్తి ఉందో అక్కడ వశుడై పోతాడని శ్రీవారు.