శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By tj
Last Updated : ఆదివారం, 25 జూన్ 2017 (15:44 IST)

తిరుమల వెంకన్న తల్లిని.... అమ్మా క్షమించు...

అమ్మకు ఆదరణ కరువైంది. హడావిడి చేసిన భక్తబృందమంతా పలాయనం చిత్తగింజారు. తల్లివి నీవే అంటూ కొంతమందైతే ఏకంగా పాటలు పాడారు. కలియుగ ప్రత్యక్షదైవం వెంకన్న తల్లికి ఆమే అండగా ఉంటున్నామన్నట్లు హంగామా చేశారు.

అమ్మకు ఆదరణ కరువైంది. హడావిడి చేసిన భక్తబృందమంతా పలాయనం చిత్తగింజారు. తల్లివి నీవే అంటూ కొంతమందైతే ఏకంగా పాటలు పాడారు. కలియుగ ప్రత్యక్షదైవం వెంకన్న తల్లికి ఆమే అండగా ఉంటున్నామన్నట్లు హంగామా చేశారు. కానీ శంఖుస్థాపనలతోనే ముగిసిపోయింది టిటిడి బోర్డు సభ్యుల హడావిడి. వకుళామాత అమ్మవారి ఆలయ నిర్మాణానికి పరిష్కారం దొరికిందని భావించిన భక్తులు తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయారు. 
 
తిరుమల వెంకన్న ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేవుడు. ఎన్నో దేశాల నుంచి ప్రతిరోజు భక్తులు వచ్చి ఆయనకు మ్రొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. భక్తుల రాకతో కొన్ని కోట్లకు పడుగలెత్తారు వెంకటేశ్వరస్వామి. ఆయనకు ఉన్న ఆస్తులు అన్నీ ఇన్నీ కావు. దేశ వ్యాప్తంగా టిటిడి డబ్బులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా స్వామి డబ్బులను భారీగానే నొక్కేస్తోంది. ఇంత జరుగుతున్నా ఆ తల్లికి ఒక చిన్న గుడి కట్టించలేని దీనపరిస్థితి తిరుమల వెంకన్నది. వెంకటేశ్వరస్వామికి స్వయానా తల్లి అయిన వకుళామాతకు ఇంతవరకు నిలువ నీడ లేదంటే ఆశ్చర్యమేస్తుంది. చారిత్రక నేపథ్యం ఆధారంగా తిరుపతి సమీపంలోని పేరూరు బండ వద్ద వకుళామాత ఆలయం ఉండేదని గుర్తించారు. అప్పుడప్పుడు కొంతమంది భక్తులు అక్కడకు వెళ్ళి పూజలు కూడా చేశారు. 
 
అమ్మవారికి మంచి ఆలయాన్ని నిర్మించాలని చాలామంది పీఠాధిపతులు, భక్తులు, హిందూ ధార్మిక వేత్తలు డిమాండ్ చేశారు. ఎన్నో పోరాటాలు కూడా చేశారు. కానీ అవేవీ ఫలించలేదు. చివరకు గతంలో టిటిడి బోర్డుగా ఉన్నప్పుడు కొంతమంది బోర్డు సభ్యుల చొరవతో వకుళామాత ఆలయానికి అంగరంగవైభవంగా పునాదిరాయి వేశారు. తర్వాత ఆ విషయాన్నే మరిచిపోయారు. ఎప్పటి నుంచో అక్కడ కొనసాగుతున్న వివాదం మళ్ళీ ఊపందుకుంది. పూర్తిగా నాణ్యమైన గ్రానైట్ రాయి మీద ఈ వకుళామాత ఆలయం ఉంటుంది. చారిత్రక నేపథ్యం ప్రకారం అక్కడే గుడిని నిర్మించాలన్నది ధార్మికవేత్తల డిమాండ్. అయితే ఆ పరిసర గ్రామాల్లో ఉండే ప్రజలు గత కొన్నేళ్ళుగా ఆ గ్రానైట్ రాయిని తవ్వి తరలిస్తున్నారు. ఇప్పటికే గుడి చుట్టూ ఉన్న గ్రానైట్ మొత్తం తరలించేశారు. 
 
ఇప్పుడు మళ్ళీ ఆలయ నిర్మాణం ఆగిపోవడంతో ఈ గ్రానైట్ మాఫియా రెచ్చిపోతోంది. చివరకు గుడి పరిసరాల్లో కూడా ఉన్న గ్రానైట్‌ను త్రవ్వి టన్నుల కొద్దీ తరలించేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే అక్కడ వకుళామాత ఆలయ గుడి ఆనవాళ్ళు కూడా దక్కే అవకాశం లేదు. మందుబాబులకు ఈ ఆలయమే అడ్డాగా మారిపోయింది. అంత ఖర్చు పెట్టి అంత ఆర్భాటంగా శంఖుస్థాపన చేసిన టిటిడి ఇప్పుడెందుకు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పట్లో గనుక నిర్లక్ష్యం వహిస్తే ఇక గుడిని కాపాడుకునే అవకాశం లేదంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా టిటిడి అధికారులు మేల్కొని ఆలయ నిర్మాణం చేపట్టాలని భక్తులు కోరుకుంటున్నారు.