శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 9 జూన్ 2018 (13:12 IST)

పూరీ జగన్నాథుని రత్న భాండాగారం.. ఆ తాళం చెవి ఏమైంది?

సుప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయ రత్నభాండాగారానికి చెందిన మూడు తాళాల విధానం ఎలా వచ్చింది.. ఆ మూడింటిలో ఒక తాళం లేకుండా భాండాగారాన్ని తెరవడం సాధ్యం కాదా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పూరీ శ్రీక్షేత్ర

సుప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయ రత్నభాండాగారానికి చెందిన మూడు తాళాల విధానం ఎలా వచ్చింది.. ఆ మూడింటిలో ఒక తాళం లేకుండా భాండాగారాన్ని తెరవడం సాధ్యం కాదా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పూరీ శ్రీక్షేత్ర ఆలయంపై పెత్తనం పూరీ గజపతి రాజులదే. రాజుల కాలం పోయాక వారి వారసులు ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. 
 
ప్రస్తుతం ఆ అధికారం ప్రభుత్వానిదే. సర్కారు ఆధీనంలోని భాండాగారాన్ని 1978లో తెరిచారు. అప్పుడు ఖజానాలో సంపద లెక్కించారు. కానీ ఆ లెక్కల వివరాలు అందుబాటులో లేవు. ఇంకా జగన్నాథ ఆలయ భాండాగారం ప్రధాన గదికి మూడు తాళాలున్నాయి. ఈ మూడింటిని ఒకేసారి వినియోగిస్తేనే తలుపు తెరుచుకుంటుంది. వీటిలో ఒకటి పూరీరాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌ దగ్గర ఉంటుంది. ఇంకొకటి ఆలయ సెక్యూరిటీ దగ్గర పెట్టారు. మూడో తాళం చెవి ఆలయ పాలనాధికారి దగ్గర ఉంటుంది.
 
1960 వరకు ప్రధాన గది తాళం చెవి ఒకటి రాజు దగ్గరే ఉండేది. ఆ తర్వాత శ్రీక్షేత్ర పాలనా బాధ్యతలు పూర్తిగా ప్రభుత్వం స్వీకరించాక ఆ తాళం చెవిని నాటి పాలనాధికారికి అప్పగించారు. అయితే అందులో ఓ తాళం చెవి మాయం కావడంతో కొందరు పూరీరాజుపై అనుమానం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి రాజు వివరణ కూడా ఇచ్చారు.
 
తన దగ్గర భాండాగారం మొదట గదికి సంబంధించి ఒక తాళం చెవి మాత్రమే ఉందని తెలిపారు. 1960 నుంచి ప్రధాన ద్వారం తాళం చెవి బాధ్యత శ్రీక్షేత్ర పాలనాధికారి, కలెక్టర్‌కే ప్రభుత్వం పరిమితం చేసిందని గుర్తు చేశారు. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలోని ట్రెజరీ తాళం చెవులు అనుమానాస్పద రీతిలో మాయమైన సంగతి తెలుసుకున్న భక్తులు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. 
 
అయితే తాళం చెవి పోయినా అందులోని సంపద మాత్రం భద్రంగా ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే పూరీ రత్నాభాండాగారంలోని సంపదలు పరుల పరం కాకుండా వుండాలని భక్తులు భావిస్తున్నారు. అయినప్పటికీ పూరీ రత్న భాండాగారం తాళం చెవులు ఎక్కడున్నాయనే దానిపై వున్న అనుమానాలు వీడట్లేదు.