శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : శుక్రవారం, 12 ఆగస్టు 2016 (13:10 IST)

పుస్కరాల సందడి లేని రాయలసీమ... పట్టించుకోని సర్కారు - తితిదే

ఆగస్టు 12వ తేదీ నుంచి ప్రారంభమైన కృష్ణానది పుష్కరాలను వందల కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం నిర్వహిస్తోంది. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం 7 కోట్ల 50 లక్షల రూపాయల ఖర్చుతో విజయవాడ కేంద్రంగా ప్రత్యేక కార

ఆగస్టు 12వ తేదీ నుంచి ప్రారంభమైన కృష్ణానది పుష్కరాలను వందల కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వం నిర్వహిస్తోంది. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం 7 కోట్ల 50 లక్షల రూపాయల ఖర్చుతో విజయవాడ కేంద్రంగా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కృష్ణానది దాదాపు 130 కిలోమీటర్ల దూరం ప్రవహించే రాయలసీమలో మాత్రం పుష్కరాల హడావిడి కనిపించడం లేదు. అటు ప్రభుత్వం, ఇటు తితిదే రాయలసీమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాయన్న ఆవేదన ఈ ప్రాంత ప్రజల్లో వ్యక్తమవుతోంది. తితిదే అయినా కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ఆలయాల్లో కార్యక్రమాలు నిర్వహించాలన్న ఆకాంక్ష జనంలో ఉంది.
 
ధార్మిక సంస్థ అయిన తితిదే కూడా కృష్ణానది పుష్కరాల్లో సీమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఇక్కడి జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో పుట్టి, కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ మీదుగా ప్రవహించి, నాగార్జున సాగర్‌ మార్గంలో విజయవాడకు చేరుకునే కృష్ణానది, విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ దాటిన తర్వాత బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది 29 ఉపనదుల సంగమంతో 1300 కిలోమీటర్ల ప్రవహిస్తున్నది. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో 120 కిలోమీటర్ల దూరం కృష్ణానది పారుతోంది. కృష్ణానది పొడవునా పురాతన ఆలయాలున్నాయి. శ్రీశైలంలోని పాతాళ గంగ అత్యంత ప్రాచీనమైనది. సిద్థేశ్వరం దగ్గర ప్రాచీనమైన సంఘమేశ్వరాలయం ఉంది. అన్నింటికంటే ముచ్చుమర్రి ప్రాంతం చాలా కీలకం. 
 
విశాలమైన ప్రాంతం దాదాపు ఆరు కిలోమీటర్ల ఘాట్ల నిర్మాణం చేపట్టవచ్చు. అలా ఈ ప్రాంతం శైవ క్షేత్రాలకు, పురాతన దేవాలయాలకు నిలయం. ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో నదిలో నీరు నిల్వ ఉంటుంది. వేలాదిమంది స్నానం చేస్తే ఇబ్బందులు కూడా వస్తాయి. అదే రాయలసీమ ప్రాంతంలో నీటి నిల్వకు శ్రీశైలం ప్రాజెక్టులో తప్ప ఎక్కడా అవకాశం లేదు. అంటే నది ప్రవాహంలోనే ఉంటుంది. దీంతో అనుక్షణం కొత్త నీరు వస్తుంటుంది. అందువల్ల స్నానాలు ఆచరించడానికి ప్రజలకు సౌకర్యంగానూ ఉంటుంది. అందుకే రాయలసీమలోని ముచ్చమర్రి, సంఘమేశ్వరం, శ్రీశైలం ప్రాంతంలో పుష్కర క్రతువు నిర్వహించడం సంప్రదాయకంగాను, ప్రజలకు సౌకర్యంగానూ ఉంటుంది. 
 
కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు అని రాయలసీమ ఉద్యమకారుడు సీఎంకు వినతిపత్రంకు కూడా ఇచ్చారట. పుష్కారల కోసం 7.50 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్న తితిదే కూడా రాలయసీమ ప్రాంతంలో కార్యక్రమాల గురించి ఆలోచించలేదు. విజయవాడ, అమరావతి తప్ప ఇతర ప్రాంతాల్లోనూ ఆలయాలున్న స్పృహ కూడా తితిదేకి లేకుండా పోయింది. తెలంగాణాలో మొక్కుబడిగా సాంస్కృతి, ధార్మిక కార్యక్రమాలకే పరిమితమైంది. రాయలసీమలో అదీ లేదనీ సీమవాసులు వాపోతున్నారు. ఇటు ప్రభుత్వం, అటు తితిదే సీమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న ఆవేదనతో ప్రైవేటు వ్యక్తులే సీమలో పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాయలసీమ పరిరక్షణ సమితి నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ముచ్చమర్రిలో లక్షలాది రూపాయల వ్యయంతో పుష్కర ఘాట్లు నిర్మించారు. 
 
లక్షల మంది స్నానాలు చేసేందుకు వీలుగా ఘాట్‌ల నిర్మాణం జరిగింది. కృష్ణా పుష్కరాలను రాయలసీమ కేంద్రంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి సీమవాసులకు లేఖలు పంపారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని విజయవాడ సమీపంలో కృష్ణలో కలపడం వల్ల అక్కడి కృష్ణానది విశిష్టతను కోల్పోయిందని అందుకే అక్కడి కంటే సీమలో పుష్కర స్నానాలు చేయడం  శ్రేష్టమనే వాదననూ సీమ నేతలు ముందుకు తెచ్చారు. రాయలసీమ ఉద్యమ నేతలు తెరపైకి తెచ్చిన అంశాలతో వివాదాలతో తితిదేకి సంబంధం లేదు. పుష్కరాలు అనేవి ఆధ్మాత్మిక, ధార్మిక వ్యవహారానికి సంబంధించినది కాబట్టి ఈ విషయలో తితిదే మరింత ఉదాత్తంగా ఆలోచించి ఉండాల్సింది. తితిదే మనగుడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోను వేలాది ఆలయాల్లో కార్యక్రమాలు చేపట్టింది. 
 
అదేవిధంగా అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఊరూరా హరికథలు, ప్రవచనాలు, పురాణాలు వంటివి చెప్పిస్తోంది. అదే పనిని ఇప్పుడు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని ఆలయాలకు ప్రాధాన్యత ఇచ్చి చేసి ఉండవచ్చు. ఎటూ స్థానికంగా ఆయా ఆలయాలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి. అందులో తితిదే కూడా భాగస్వామ్యం అయి ఉంటే సరిపోయేది. దీని వల్ల తితిదే ప్రతిష్ట పెరిగేదే తప్ప తరిగేది కాదు. ఇంకో కోటి రూపాయలో రెండు కోట్ల రూపాయలలో ఖర్చు చేసి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా తితిదే కార్యక్రమాలు నిర్వహించిందన్న మంచి పేరు వచ్చేది. అలాంటి అవకాశాన్ని తితిదే చేజేతులా పోగొట్టుకుంది.