శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 23 ఆగస్టు 2014 (13:54 IST)

మహాభారతంలో హనుమంతుడు ఏం చేశాడు?

రామాయణంలో హనుమంతుని పాత్ర గురించి అందరికీ బాగా తెలుసు. కానీ మహాభారతంలో హనుమంతుడి పాత్ర గురించి కొందరికే తెలిసివుండొచ్చు. హనుమంతుడు రెండుసార్లు, మహాభారతంలో కూడా కనిపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
 
హనుమాన్ చిరంజీవి. అందుచేత హనుమాన్ మహాభారతంలోనూ కనిపిస్తాడు. హనుమంతుడిని భీముడికి సోదరుడిగా చెపుతారు. ఇద్దరూ వాయుదేవుని కుమారులే.. మహాభారతంలో హనుమంతుడు మొదటిసారి పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు భీముడిని కలుస్తాడు
 
రెండవసారి హనుమాన్ కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడి రథాన్ని రక్షిస్తూ, రథం మీద ఉన్న జెండాలో ఉంటాడు.
 
మొదటిసారి హనుమంతుడు పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు భీముడిని కలుస్తాడు. వనవాసం చేస్తున్నప్పుడు ద్రౌపది భీముడిని సౌగంధిక పువ్వులు కావాలని కోరుతుంది. భీముడు పువ్వుల కోసం బయలుదేరాడు. అతను వెళుతున్న మార్గంలో ఒక పెద్ద కోతి విశ్రాంతి తీసుకుంటూ అడ్డంగా పడుకుని ఉన్నది. భీముడు ముందుకు వెళ్ళటానికి కోతిని అడ్డు తొలగమని మరియు మార్గం సుగమం చేయమని కోరాడు. 
 
కానీ ఆ కోతి, తానూ చాలా ముసలివాడినని, తోకను కూడా తొలగించలేని శక్తిహీనుడినని, అందువలన భీముడినే అడ్డు తొలగించుకొని వెళ్ళమని ప్రాధేయపడింది. అందువలన భీముడు ముందుకు వెళ్ళాలంటే తప్పనిసరిగా కోతి తోకను పక్కకు పెట్టి వెళ్ళాలి. 
 
భీముడు కోతిపట్ల చులకనగా చూశాడు మరియు తన గదతో తోకను పక్కకు పెట్టటానికి ప్రయత్నించాడు. కానీ తోకను ఒక అంగుళం కూడా కదిలించలేకపోయాడు. భీముడు చాలా ప్రయత్నించిన తరువాత, ఈ కోతి సాధారణమైనది కాదని తెలుసుకున్నాడు. అందువలన భీముడు శరణు కోరాడు మరియు క్షమాపణ అడిగాడు. అప్పుడు హనుమంతుడు, తన అసలు రూపంలోవచ్చి భీముడిని ఆశీర్వదించాడు. 
 
అర్జునుడి రథం; మహాభారతంలో, మరొక సంఘటనలో హనుమాన్ రామేశ్వరం వద్ద ఒక సాధారణ కోతి రూపంలో అర్జునుడిని కలుసుకున్నాడు. లంకకు వెళ్ళటానికి రాముడు నిర్మించిన వంతెన చూసి అర్జునుడు ఈ వంతెనను నిర్మించడానికి కోతుల సహాయం తీసుకున్నాడు. ఎందుకు! అని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు అదే తను అయితే ఒక్కడే ఈ వంతెనను బాణాలతో నిర్మించి ఉండేవాడినని అనుకున్నాడు. 
 
హనుమాన్ వెటకారంగా నీ బాణంతో నిర్మించిన వంతెన అయితే సంతృప్తికరంగా ఉండేది కాదని, ఆ వంతెన ఒక వ్యక్తి బరువును మోసి ఉండేది కాదని విమర్శించాడు. అర్జునుడు దీనిని ఒక సవాలుగా తీసుకున్నాడు. అర్జునుడు, తాను నిర్మించిన వంతెన సంతృప్తికరంగా లేదంటే, అప్పుడు తాను అగ్నిలో దూకుతానన్నాడు 
 
దీంతో అర్జునుడు తన బాణాలతో ఒక వంతెన నిర్మించారు. హనుమాన్ దానిపై కాలు మోపగానే ఆ వంతెన కూలిపోయింది. అర్జునుడు నిశ్చేష్టుడయ్యాడు. తన జీవితం అంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునిని ముందు ప్రత్యక్షమై ఆ వంతెనను తన దివ్య స్పర్శతో పునర్నిర్మించాడు. అప్పుడు దానిపై పాదం మోపమని హనుమంతుడిని కోరాడు. ఈసారి వంతెన కూలిపోలేదు. 
 
అందువలన, హనుమాన్ అతని అసలు రూపంలో ప్రత్యక్షమై జరగబోయే యుద్ధంలో అర్జునుడికి సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. అందుకే కురుక్షేత్ర యుద్ధం సంభవించినప్పుడు హనుమంతుడు అర్జునుని రథజెండాపై యుద్ధప్రారంభం నుండి ముగిసేవరకు ఉన్నాడు. 
 
కురుక్షేత్రయుద్ధం చివరి రోజున, కృష్ణుడు, అర్జునుడిని మొదటగా రథాన్ని దిగమని కోరాడు. అర్జునుడు క్రిందికి దిగిన తరువాత, శ్రీ కృష్ణుడు యుద్ధం అంతం వరకు హనుమంతుడు అక్కడ ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. 
 
అప్పుడు హనుమంతుడు వంగి నమస్కరించడమే కాకుండా రథం వదిలి వెళ్ళాడు. హనుమంతుడు వెళ్లిన వెంటనే రథం అగ్నికి ఆహుతి అయింది. ఇదంతా వీక్షించిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు కృష్ణుడు "ఇప్పటివరకు హనుమంతుడు రక్షించటం వలన ఈ దివ్యమైన ఆయుధాలు ఏమి చేయలేకపోయాయి. 
 
లేనట్లయితే ఎప్పుడో రథం అగ్నికి ఆహుతి అయి వుండేదన్నాడు. కాబట్టి  హనుమంతుడు రామాయణంలో మాత్రమే కాదు కానీ మహాభారతంలో కూడా ఒక కీలకమైన పాత్ర పోషించాడు.