గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: శనివారం, 26 మే 2018 (22:32 IST)

వెయ్యి మంది భక్తులలో నిజంగా ముక్తి కోసం ప్రయత్నించేవారు...

వెయ్యి మంది భక్తులలో నిజంగా ముక్తి కోసం ప్రయత్నించేవాడు ఏ ఒక్కడో ఉంటాడని ద్వాపర యుగంలోనే శ్రీ కృష్ణుడు చెప్పాడు. అటువంటప్పుడు ఈ కాలం సంగతి వేరే చెప్పాలా... అటువంటప్పుడు ఆత్మ జ్ఞానం గల సద్గురువులు ఎంత అరుదు. అట్టి వారిని మాత్రమే ముముక్షువులు ఆశ్రయించా

వెయ్యి మంది భక్తులలో నిజంగా ముక్తి కోసం ప్రయత్నించేవాడు ఏ ఒక్కడో ఉంటాడని ద్వాపర యుగంలోనే శ్రీ కృష్ణుడు చెప్పాడు. అటువంటప్పుడు ఈ కాలం సంగతి వేరే చెప్పాలా... అటువంటప్పుడు ఆత్మ జ్ఞానం గల సద్గురువులు ఎంత అరుదు. అట్టి వారిని మాత్రమే ముముక్షువులు ఆశ్రయించాలని భగవద్గీత చెబుతున్నది. అయితే వారిని గుర్తించి ఆశ్రయించేదెలా.. శ్రీ గురుచరిత్ర అట్టి సంకల్పంతో పారాయణ చేస్తుంటే దత్తాత్రేయుడే మనలను అట్టి మహాత్ముని వద్దకు పంపుతారు. ఒక శ్రీమంతుడు తనకు మగ బిడ్డ కలిగితే, వేయిమంది బ్రాహ్మణులకు భోజనమిస్తానని మ్రెుక్కుకొని గాణ్గాపురంలో శ్రీ గురుచరిత్ర పారాయణ చేశాడు. త్వరలో ఆ కోరిక నెరవేరింది గాని వ్యాపారంలో సర్వమూ కోల్పోయి, అతడు దిగులుతో మరణించాడు. 
 
అతడి భార్య కష్టం చేసి బిడ్డను పోషిస్తున్నదిగాని మ్రెుక్కు గురించి భయపడి గాణ్గాపురం వెళ్లి ప్రత్యామ్నాయం తెల్పమని దత్తస్వామినే ప్రార్ధించింది. ఆ రాత్రి కలలో దత్తస్వామి కనిపించి అక్కల్కోటలోని స్వామిని నేనే వారికి భిక్ష ఇస్తే వేయిమందికి పెట్టినట్లే అన్నారు. ఆమె అక్కల్కోటలో స్వామిని దర్శించగానే, వారు భిక్షకోరి ఆరగించి అమ్మా వేయిమంది బ్రాహ్మణులకు భోజనం ముట్టింది అన్నారు. శ్రీ దత్తానుగ్రహం వలన ఆమె కోరిన ప్రత్యామ్నాయానికి తోడు సద్గురు దర్శనం గూడా లభించింది.
 
భరధ్వాజ మాష్టారు గారు 1973లో గాణ్గాపూర్‌లో నిత్యమూ శ్రీ సాయిబాబా జీవితచరిత్ర, గురుగీత పారాయణ చేస్తూ కొద్ది రోజులున్నారు. ఒక రోజు ఒక సాధువు భరద్వాజా మాష్టరు గారితో దత్తాత్రేయ స్వామి ఏదో ఒక రూపంలో మధ్యాహ్న సమయంలో భిక్షకు వస్తారు అని అన్నారు. అప్పుడు మాష్టారు గారు సాధువుగారితో, ఇచ్చటి భక్తులు శ్రద్దతో భిక్ష ఇవ్వటం కోసం ఆనాడు స్వామి అలా చెప్పారేమో గాని, ఇన్ని శతాబ్దాల తర్వాత దత్తాత్తేయ స్వామి భిక్షకు ఎలా రాగలరు అన్నాను. 
 
ఆ సాధువిలా అన్నారు.... మెుదట నేను అలాగే తలచాను గాని ఇక్కడ భక్తులకయ్యే అనుభవాలు విని నిజమన్పించి, వారే రూపంలో భిక్షకు వస్తారో గుర్తించి వారి పాదాలు పట్టుకోవాలని తలచి దీక్షగా శ్రీ గురుచరిత్ర పారాయణచేస్తూ భిక్షకు వచ్చే వారిని జాగ్రత్తగా గమనించనారంభించాను. ఒక రాత్రి స్వామి స్వప్న దర్శనమిచ్చి.... నారాక దైవరహస్యం. నన్ను గుర్తించ యత్నించవద్దు అని హెచ్చరించారు. కాని నేను పట్టు విడువలేదు. మరు రోజు కృష్ణలో స్నానం చేయగానే తీవ్రమైన జ్వరము, తలనొప్పి వచ్చి భిక్షకు పోకుండా నిద్రపోయాను. మధ్యాహ్నం 3-30 గంటలకు మెలకువ వచ్చేసరికి జ్వరము, తలనొప్పి తగ్గిపోయాయి. 
 
ఆకలి భరించలేక భిక్షకు వెళితే ఒక గృహస్ధు, మధ్యాహ్నం నేనే గదా నీకు భిక్ష వేశాను అని కసిరాడు. జరిగినది యెంత చెప్పినా అతడు నమ్మలేదు. నాటి రాత్రి స్వామి మళ్లీ స్వప్న దర్శనమిచ్చి , నన్ను నీవేమి పట్టగలవు. నీ రూపంలో నేనే భిక్ష చేశాను అన్నారు. ఆయన నేటికి భిక్షకు వచ్చేమాట నిజం. ఇప్పటికి గాణ్గాపురంలో ప్రజలు మధ్యాహ్న సమయంలో భిక్షకు వచ్చిన వారికి అత్యంత శ్రద్ధాభక్తులతో భిక్షను ఇస్తారు.