గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 11 జులై 2014 (16:32 IST)

వ్యాస పూర్ణిమ నాడు ఏ శ్లోకాన్ని పఠించాలి

మాతృ దేవో భవ
పితృ దేవో భవ
ఆచార్య దేవోభవ... అన్నది ఆర్యోక్తి. దైవ సమానులైన తల్లి, తండ్రి తర్వాత పూజనీయమైన గురువులనూ దైవసమానంగా పూజించాలని మన సంస్కృతి చెబుతోంది. అలా గురువులను పూజించుకోవడానికి ప్రత్యేక తిధి కూడా ఉంది. అదే వ్యాస పూర్ణిమ. ఇది ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు పండుగలా జరుపుకోబడుతుంది. 
 
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే
నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః
 
వ్యాస మహర్షి జన్మ తిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమ (జూలై 12-శనివారం)గా జరుపుకుంటాం. లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మ తిథిని గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది. భారత భాగవతాలు, అష్టాదశ పురాణాలు, ఉప పురాణాలు అందించిన మహానుభావులు వ్యాస భగవానుడు.
 
శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం
సూత్ర భాష్యకృతౌ వందే భగవంతౌపునః పునః
 
వ్యాస పూర్ణిమ నాడు ఈ శ్లోకాన్ని పఠించాలి. అంతే కాదు, విష్ణు అవతారంగా భావించే వ్యాసుడ్ని పూజించి విష్ణుపురాణం దాన మివ్వడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవడంతో పాటు శుభఫలితాలుంటాయన పురాణాలు చెబుతున్నాయి. 
వ్యాస మహర్షి నాలుగు వేదాలను లోకానికి అందించాడని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం సోమకాసురుడు వేదాలను సముద్రంలో దాచేస్తే..  శ్రీ మహా విష్ణువు మత్స్యావతారంలో ఆ వేదాలను తీసుకొచ్చాడని, అలా వచ్చిన వేదాలు ఒకదానితో ఒకటి కలిసి పోయి గజిబిజీ అయిపోగా.. వాటిని వ్యాస మహర్షి విడదీసి విభజించి నాలుగు వేదాలుగా లోకానికి అందించాడని పురాణాలు చెబుతున్నాయి.