శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By PNR
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2015 (06:58 IST)

తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీనివాసుడు మొదట పెద్దశేష వాహనంపైనే ఊరేగుతాడు.. ఎందుకని?

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాల ప్రారంభానికి శుభసూచకంగా తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం అంకురార్పణ జరిగింది. అంకురార్పణ జరిగాక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించడానికి విష్ణుమూర్తి సర్వసైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుడు స్వయంగా విచ్చేస్తాడు. ఈ అంకురార్పణ తర్వాత మాడ వీధుల్లో విష్వక్సేనుడు ఊరేగారు. ఆ తర్వాత బుధవారం సాయంత్రం తొలుత ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంమవుతాయి.
 
 
ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు తొలి ఘట్టం.. ధ్వజారోహణం. ధ్వజస్తంభంపై పతాకావిష్కరణ చేస్తారు. స్వామి వాహనమైన గరుడుడి చిత్రాన్ని పతాకంపై ముద్రిస్తారు. ఈ గురడధ్వజమే బ్రహ్మోత్సవాలకు సకల దేవతలని ఆహ్వానించే స్వాగతపత్రం. ఆ స్వాగతాన్ని అందుకొని అష్టదిక్పాలకులు, సమస్త దేవతలు, గంధర్వగణాలు విచ్చేస్తాయి. వారందరికీ స్థలాలను కేటాయించి నియమంతో బలిదానం చేస్తారు
 
అయితే, ఈ బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు స్వామివారు పెద్దశేష వాహనంపై ఊరేగుతారు. శ్రీనివాసుడు మొదట ఆదిశేషుడిపై ఊరేగడానికి కారణం లేకపోలేదు. ఆదిశేషుడు శ్రీహరికి అత్యంత సన్నిహితుడనేది పురాణ కథల సారాంశం. రామావతారంలో రాముడి తమ్ముడు లక్ష్మణుడుగా, కృష్ణావతారంలో కృష్ణుడి అన్న బలరాముడిగా ఆదిశేషుడు తోడుగా ఉన్నారని ప్రతీతి. 
 
కలియుగంలో కూడా శ్రీవారి రుణం తీర్చుకునేందుకు గోవిందరాజస్వామి రూపంలో ఉన్న శ్రీవారికి ఆదిశేషుడు అత్యంత సన్నిహితంగా ఉన్నారట. అందుకే స్వామివారు తన తొలి వాహనంగా ఆదిశేషుడిపై దర్శనమిస్తాడని భక్తుల విశ్వాసం. ఈ వాహన సేవను చూస్తే మానవుల పాపాలు ప్రక్షాళన అవుతాయని, స్వామివారి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెపుతుంటారు. 
 
కాగా, ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తితిదే ఘనమైన ఏర్పాట్లు చేసిది. ముఖ్యంగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండేలా చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ఏపీఎస్ ఆర్టీసీ కొత్తగా 60 మినీ బస్సులను నడుపుతోంది. ఈ బ్రహ్మోత్సవాల్లో 1.50 కోట్ల మంది భక్తులను చేరవేసేలా ఆర్టీసీ బస్సులను సిద్ధం చేసిందన్నారు.