శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2016 (11:27 IST)

తిరుమల ఆలయంలో హుండీ ఎవరు, ఎప్పుడు పెట్టారో తెలుసా..!

తిరుమల. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్షేత్రాల్లో తిరుమల ఒకటి. కోట్లాదిమంది హిందువులకు ఆరాధ్యదైవం శ్రీనివాసుడు. ప్రతిరోజు 50 నుంచి 70 వేలమందికిపైగా భక్తులు తిరుమలకు వస్తూపోతూ ఉంటారు.

తిరుమల. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్షేత్రాల్లో తిరుమల ఒకటి. కోట్లాదిమంది హిందువులకు ఆరాధ్యదైవం శ్రీనివాసుడు. ప్రతిరోజు 50 నుంచి 70 వేలమందికిపైగా భక్తులు తిరుమలకు వస్తూపోతూ ఉంటారు. స్వామివారిని దర్శించుకునే భక్తులు ఆయనకు ముడుపులు సమర్పిస్తుంటారు. ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీ ద్వారా భక్తులు కానుకలను సమర్పిస్తుంటారు. అసలు హుండీ శ్రీవారి ఆలయంలో ఎవరు, ఎప్పుడు ఏర్పాటు చేశారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు తెలుసుకుందాం.
 
శ్రీవారి హుండీ.. తిరుమల తిరుపతి దేవస్థానం నడపడానికి, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి స్వామివారి హుండీ ఆదాయమే ప్రధానం. హుండీ ద్వారా వచ్చే ఆదాయాన్నే తితిదే ఖర్చు చేస్తూ వస్తోంది. అలాంటి హుండీ ఆదాయం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. 1821వ సంవత్సరం జూలై 25వ తేదీన మొదటిసారి శ్రీవారి ఆలయంలో హుండీని ఏర్పాటుచేశారు. అది కూడా బ్రిటీష్ వారే. అప్పట్లో బ్రిటీషులు ఆధీనంలో శ్రీవారి ఆలయం ఉండటంతో పాటు ఆదాయం కూడా ఎక్కువగా వస్తుండటంతో ఏం చేయాలో పాలుపోక వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలోపల స్వామివారి ఎడమ వైపున ఒక చిన్న హుండీని పెట్టారు. ఆ తర్వాత అదీ కూడా నిండిపోతుండటంతో పెద్ద హుండీనే తయారు చేసి పెట్టారు. ఆ హుండీని బ్రిటీష్‌ వారు కొప్పెర అంటారు.
 
ఇదిలావుంటే మొదటిసారి స్వామివారికి 1958వ సంవత్సరంలో లక్ష రూపాయల ఆదాయం వచ్చిందట. ఆ ఆదాయమే అప్పట్లో చరిత్రట. ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగిన దేవుడిగా వెలుగులీనుతున్న స్వామివారి హుండీ ఆదాయం ఆ తర్వాత పెరుగుతూనే వస్తోంది. ఇప్పటికీ ప్రతిరోజు రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తుండగా రద్దీ సమయాల్లో 4 కోట్ల రూపాయలకు దాటుతోంది. రికార్డు స్థాయిలో ఒక్కోసారి ఒక్కరోజుకే 5 కోట్ల రూపాయలు కూడా వస్తోంది.
 
ప్రపంచంలోనే ఏ ఆధ్మాత్మిక క్షేత్రానికి రానంత రాబడి ఒక్క తిరుమల వెంకన్నకు మాత్రమే వస్తోంది. అందుకే ఆయన్ను అనంత సంపదకు వేలుపు అంటారు. స్వామివారికి వచ్చే సంపదతో కోట్ల రూపాయలు తితిదే ఆదాయం దాటిపోతోంది. ఇంతలా కుప్పలు తెప్పలుగా పోగవుతున్న కానుకల డబ్బులను లెక్కించడాన్నే పరకామణి అంటారు.
 
పరకామణి కోసం కొందరు భక్తులను కూడా వాలంటీర్లుగా తీసుకుని స్వామి సంపదను గణిస్తుంటారు. ప్రస్తుతం మూడు షిప్టులలో 250 మంది వరకు వాలంటీర్లు పరకామణి సేవలో తరిస్తున్నారు. లెక్కింపు సులభతరం కోసం ఆపరేషన్‌ మ్యానువల్‌ తాజాగా పరకామణి కోసం పరిపాలనా భవనంలో ప్రత్యేక ఏర్పాటుచేశారు. ఇప్పటి దాకా నోట్లు, చిల్లర డబ్బులు ఒకే దగ్గర లెక్కించేవారు. ఇక నుంచి చిల్లర పరకామణిని ప్రత్యేకంగా లెక్కిస్తామంటున్నారు అధికారులు. దీనికోసం నాణేలను ఎల్లోమెటల్‌, వైట్‌‌మెటల్‌గా విభజించి లెక్కపెడుతామంటున్నారు. సీసీ కెమెరాల నిఘాలో పైసాపైసా లెక్కగడుతున్నారు. 
 
కానుకల లెక్కింపును సులభతరం చేసేందుకు ఆపరేషన్‌ మాన్యువల్‌ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు తితిదే అధికారులు. అభయహస్తుడు తిరుమల వేంకటేశ్వరుడి దర్శనానికి బారులు తీరే భక్తులు స్వామివారికి మ్రొక్కులు సమర్పించడానికి తండోతండాలుగా పోటీ పడుతుంటారు. రోజురోజుకీ పెరుగుతున్న కానుకల ప్రవాహాన్ని లెక్కించడం తితిదే అధికారులకు సవాల్‌గానే మారుతోంది.