బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : మంగళవారం, 21 జూన్ 2016 (18:09 IST)

తిరుమలలో వరాహస్వామి ఎవరు...? తొలుత వరాహస్వామినే ఎందుకు దర్శనం చేసుకోవాలి?

తిరుమలకు వెళితే మొదటగా చాలామంది వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతనే శ్రీవారి వద్దకు వెళుతుంటారు. అసలు వరాహస్వామి ఎవరో ఇప్పటికీ చాలామందికి తెలియదు. తిరుమల గిరులు ఉన్నాయంటే అందుకు కారణమే వరాహస్వామి. స్వామివారు ఉన్న ప్రాంతం నుంచి తిరుమల మొత్తం కూడా వరాహస్వామి వారిదే. ఆయన తన స్థలాన్ని శ్రీవారికి ఇచ్చేశారు. అందుకే వరాహస్వామికి తిరుమలలో ఎంతో ప్రాశస్త్యం ఉంది. తితిదే కూడా వరాహస్వామి ఆలయాన్ని స్వామి వారి నిలయం ఎడమభాగాన ప్రత్యేకంగా నిర్మించింది. ప్రతిరోజు ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. 
 
పూర్వం ఒకానొకప్పుడు జలప్రళయం ఏర్పడింది. ఆ ప్రళయంలో లోకాలన్నీ నీటితో మునిగిపోయాయి. అదే సందర్భంలో హిరణ్యాక్షుడనే దుష్టరాక్షసుడు భూమండలాన్ని బంతిగా చేసుకుని ఆడుకుంటూ నానాభీభత్సం చేస్తుంటాడు. చివరకు నీటిలో భూమిని ముంచి అల్లకల్లోలం చేస్తాడు. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు శ్వేత వరాహరూపంలో అవతరించి తనవాడి కోరలతో హిరణ్యాక్షుడిని సంహరించి, నీటిలో మునుగుతున్న భూదేవిని ఉద్ధరించి రక్షించాడు. యక్ష కిన్నర గంధర్వాది దేవతలందరూ, శ్రీ భూవరాహస్వామి మీద పూలవానకురిపించి అనే విధాలుగా కీర్తించారు. 
 
ఇదే శ్వేతవరాహ రూపంతోనే, భూదేవితో కూడి దర్శనం ఇస్తూ ఈ వేంకటాచల క్షేత్రంపైనే, మరికొంత కాలం పాటు దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఉండవలసిందిగా అందరూ అనేక విధాలుగా ప్రార్థించారు. అందరి కోరికలను మన్నించి సరేనన్నాడు వరాహస్వామి. అప్పటి నుంచే శ్వేత వరాహకల్పం ప్రారంభమైంది. అంతేకాదు భూదేవిని రక్షించి భూదేవిలతో కలిసి ఆదివరాహస్వామి స్థిరపడి కొలువై దర్శనమిస్తూ ఉన్న ఈ దివ్యక్షేత్రమే ఆదివరాహక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. అక్కడే ఆ క్షేత్రంలో కొలువై ఉన్న ఆది వరాహస్వామివారిని వకుళామాలిక అనే యోగిని సేవిస్తూ సపర్యలు చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉండేది.
 
ఇలా కొంతకాలం గడిచింది. ఇంతో వృషభానుడుడనే క్రూర రాక్షసుడు ఆ కొండల్లో కోనల్లో తిరుగుతూ అక్కడ తనమాచరించుకుంటన్న మునులను బాధిస్తూ ఉండేవాడు. సజ్జనులను హింసిస్తూ ఉండేవాడు. వాళ్ళందరూ వెళ్ళి వరాహస్వామితో విన్నవించుకున్నారు. వారి బారి నుంచి తమను రక్షించమని అనేక విధాలుగా ప్రాదేయపడ్డారు. శ్వేత వరాహస్వామి చాలా కాలంపాటు ఆ వృష భాసురునితో యుద్ధం చేసి వాణ్ణి సంహరించాడు. అలా వీర విజయంతో తిరిగి వస్తున్న సందర్భంలో వరాహస్వామికి ఆ పర్వతంలో తలమీది గాయంతో రక్తం కారుతూ మూలికల కోసం అన్వేషిస్తూ ఉన్న శ్రీనివాసుడు కనపడ్డాడు. 
 
శ్రీనివాసుని దీనగాథనంతా ఆలకించిన ఆదివరాహస్వామి వకుళామాలికను శ్రీనివాసునికి సేవ చెయ్యమని ఆదేశించాడు. వరాహస్వామివారి అనతిపై నియోగింపబడిన వకుళామాత ఆ క్షణం నుంచి శ్రీనివాసుని కన్నకొడుకువలె భక్తి ప్రేమలతో సేవించుతుండినది. ఇలా ఎంతో చరిత్ర కలిగిన వరాహస్వామిని ప్రతి ప్రముఖులు ముందుగానే దర్శిచుకుంటారు. గవర్నర్‌ నరసింహన్‌తో పాటు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్టీలు ఎప్పుడూ ముందుగానే వరాహస్వామిని సేవించిన తర్వాతనే శ్రీవారిని దర్శనానికి వెళుతుంటారు. వీరే కాక 60 యేళ్లు దాటిన వృద్థులందరు కూడా ముందుగా వరాహస్వామిని దర్శించుకుంటారు.