శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Modified: సోమవారం, 20 జూన్ 2016 (17:12 IST)

తిరుమలలో వైకుంఠ గుహ... శ్రీమన్నారాయణుడు రహస్యంగా సేద తీరేది అక్కడే...

తిరుమల గిరుల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయని మన పెద్దలు చెబుతుంటే చాలామంది ఇప్పటికీ నమ్మరు. అయితే పురాణాల్లో మాత్రం తిరుమల ప్రాముఖ్యత గురించి పుంఖానుపుంఖాలుగా ప్రచురితమయ్యాయి. ఎంతోమంది కవులు, రచయితలు స్వామివారు కొలువై ఉన్న తిరుమల ప్రస్థానాన్ని ఇప్పటికీ ర

తిరుమల గిరుల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయని మన పెద్దలు చెబుతుంటే చాలామంది ఇప్పటికీ నమ్మరు. అయితే పురాణాల్లో మాత్రం తిరుమల ప్రాముఖ్యత గురించి పుంఖానుపుంఖాలుగా ప్రచురితమయ్యాయి. ఎంతోమంది కవులు, రచయితలు స్వామివారు కొలువై ఉన్న తిరుమల ప్రస్థానాన్ని ఇప్పటికీ రాస్తున్నారు... రాస్తూనే ఉన్నారు. అసలు తిరుమల చరిత్ర గురించి తెలుసుకోవడం అంత సులువైన పని కాదని మఠాధిపతులు, పీఠాధిపతులు ఎన్నో సంధర్భాల్లో చెబుతుంటారు. తిరుమలలో అతి పురాతనమైన వైకుంఠ గుహ ఉందని పురాణాలు చెబుతున్నాయి. సాక్షాత్తు శ్రీనివాసుడే ఆ గుహలో దాక్కునే వారట. తిరుమలలో అతి పురాతనమైన ఆ వైకుంఠ గుహ గురించి తెలుసుకుందాం.
 
అనంత పుణ్యప్రదమైన ఈ వేంకటాచల పుణ్యక్షేత్రంలో సాక్షాత్తు వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు లీలామానుష రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అందువల్లే ఈ పుణ్యస్థలం భూలోక వైకుంఠంగా ప్రసిద్థి చెందింది. ఈ కొండ మహిమ అనంతం, అవ్యక్తం. దేవతలకు కూడా ఈ కొండ గొప్పతనంలో ఆవగింజంతయినా అర్థం కాదని పురాణాలు చెబుతున్నాయి. 
 
త్రేతాయుగంలో జరిగిన దివ్య గాథ ఇది. శ్రీరామలక్ష్మణులు అడవి బాట పట్టిన సమయంలో రావణాసురుడు అపహరించిన సీతాదేవిని వెతుకుతూ వానర సేనతో కలిసి వేంకటాద్రి దివ్యధామాన్ని చేరుకున్నారు. ఆ సమయంలో ఆ పర్వతాలలో ఆంజనేయుని మాతృమూర్తి అయిన అంజనాదేవి తపస్సు చేస్తూ ఉండేది. అప్పుడు కనిపించిన శ్రీరామచంద్రుడిని చూసిన అంజనాదేవి ఆనందపడుతూ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఓ మహానుభావా.. అద్భుతమైన ఆనందకరమైన నీ రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. రండి అంటూ పిలిచింది. 
 
అక్కడు తపస్సు చేసుకుంటున్న మరికొంతమంది ఋషులు కూడా అక్కడకు చేరుకుని శ్రీరాముడిని వేనోళ్ళ కీర్తించారు. ఆ తరువాత రామలక్ష్మణులు ఆకాశగంగ తీర్థంలో స్నానం చేసి అంజనాదేవి ఆశ్రమానికి వెళ్ళి పడుకున్నారు. అయితే వానరులందరు మాత్రం వేంకటాద్రిలోని అన్ని ప్రాంతాలను తిరుగుతూ ఉన్నారు. శ్రీవారు ప్రస్తుతం ఉన్న కొలనుకు ఈశాన్య దిశలో ఒక చీకటి గుహ వానరులకు కనిపించింది. ఎంతో ప్రకాశవంతంగా ఈ గుహ కనిపించడంతో వానరులందరూ అందులోకి వెళ్ళారు.
 
గుహలోకి వెళ్ళి చూడగా ఒక మహానగరం కనిపించింది. ఎంతోమంది స్త్రీలు, పురుషులు గుహలో వానరులకు కనిపించారు. వారందరు కూడా విష్ణువు లాగా శంఖు, చక్రాలను ధరించి తెల్లని వస్త్రాలతో ప్రకాశిస్తూ ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళి చూడగా ఆ నగరం మధ్యలో సూర్య ప్రకాశంతో వెలుగొందుతున్న ఒక దివ్యవిమానం కనిపించింది. ఆ విమానం మేరు శిఖరం లాగా గోచరిస్తూ అనేక మణిమంటపాదులతో విరాజిల్లుతూ ఉంది. 
 
కోటి సూర్యప్రకాశంతో వెలుగుతున్న బంగారు విమానం నడుమ భాగాన ఉన్న ఆదిశేషుని వేయి పడగలపై దివ్యమైన మణులు ప్రకాశిస్తున్నాయి. ఆ శేషునిపై శయనించి ఉన్న చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు వానరులకు దర్శనమిచ్చారు. శ్రీమహా విష్ణువు వక్షఃస్థలంపై శ్రీ మహాలక్ష్మి కొలువై ఉండగా, భూదేవి, నీళాదేవిలు ఆయన పాదసేవలు చేస్తున్నారు. నారదుడు గానం చేస్తూ స్వామివారిని కీర్తిస్తున్నారు. స్వామి చూపులు కరుణతో పొంగిపొరలుతోంది. ఇదంతా చూసిన వానరులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంతలో చతుర్భుజాలతోను, శంఖుచక్రాది దండాలను ధరించిన ఒక వ్యక్తి వానరులను వింతగా చూస్తూ బెదిరించాడు. దీంతో భయంతో వానరులు గుహ నుంచి బయటకు పరుగులు తీశారు.
 
జరిగిన విషయాన్ని మిగిలిన వానరులకు తెలిపారు. ఎలాగైనా ఆ  గుహకు వెళ్ళాలంటూ మిగిలిన వానరులందరు పట్టుబట్టారు. సరేనని అందరూ కలిసి అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడ ఆ గుహ లేదు. వెంటనే వెనుతిరిగిన వానరసేన వెంటనే జరిగిన మొత్తాన్ని శ్రీరామచంద్రునికి విన్నవించుకున్నారు. అప్పుడు ఆయన వానరులతో మీరు తిరుమల గిరులను చూడడమే ఒక గొప్ప వరం. శ్రీమన్నారాయణుడు తిరుమల గిరులలో ఏ సమయంలో ఎక్కడైనా ఉంటారు. ఆయన లేని చోటంటూ లేదు. ఇలాంటి గుహలు తిరుమలలో ఎన్నో ఉన్నాయి. ప్రశాంత వాతావరణం కోసం అప్పుడప్పుడు శ్రీవారు వైకుంఠ గుహలో సేదతీరుతుంటారు. అలాంటి గుహలోకి వెళ్ళడం ఎవరి వల్ల సాధ్యం కాదని శ్రీరాముడు వానరులకు తెలిపారు.
 
పురాణాలు కూడా ఇప్పటికీ చెబుతూనే ఉన్నాయి. తిరుమల గిరులలోని శేషాచలం ప్రాంతంలో ఇప్పటికీ ఎన్నో రకాల గుహలు ఉన్నాయని. మరి వైకుంఠ వాసుడు ఎప్పుడూ ఏ గుహలో రహస్యంగా (ప్రశాంతంగా) సేద తీరుతారో ఆయనకే తెలుసు. ఇలా చెప్పుకుంటే పోతే తిరుమల గిరుల ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు.